Election Commission | హైదరాబాద్, సెప్టెంబర్ 19: తెలంగాణలో 9 రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం రద్దు చేసింది. రాష్ట్రంలో నమోదైన 9 గుర్తింపు లేని రాజకీయ పార్టీలను రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. చట్టపరమైన నిబంధనలు పాటించకపోవడంతో డీలిస్టింగ్ చేసినట్లు పేర్కొన్నారు.
రద్దయిన పార్టీల్లో ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ, బీసీ భారత దేశం పార్టీ, భారత్ లేబర్ ప్రజా పార్టీ, లోక్ సత్తా పార్టీ, మహాజన మండలి పార్టీ, నవభారత్ నేషనల్ పార్టీ, తెలంగాణ ప్రగతి సమితి, తెలంగాణ ఇండిపెండెంట్ పార్టీ ఉన్నాయి.
ఈ పార్టీలన్నీ నమోదు అయినప్పటికీ గుర్తింపు పొందలేదని, ప్రజాస్వామ్య ప్రతినిధుల చట్టం–1951 ప్రకారం తప్పనిసరి నివేదికలు, లెక్కలు సమర్పించకపోవడంతో ఎన్నికల సంఘం వాటిని రద్దు చేసిందని సుదర్షన్ రెడ్డి వివరించారు.
రద్దయిన పార్టీలు ప్రధానంగా హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, భద్రాద్రి–కొత్తగూడెం జిల్లాలకు చెందినవే. వీటిలో నాలుగు పార్టీలు హైదరాబాద్కు, మరో నాలుగు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాకు, ఒకటి భద్రాద్రి–కొత్తగూడెం జిల్లాకు చెందినది.
ఈ పార్టీలను రద్దు చేసినట్లుగా జీహెచ్ఎంసీ కమిషనర్ హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారితోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించామని తెలిపారు. వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కాపాడటమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.