ఎల్లారెడ్డి రూరల్, మే 8: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్తండా సమీపంలో ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకొన్నది. బంధువులను పరామర్శించి వస్తుండగా ట్రాలీ ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టిన ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. పిట్లం మండలంలోని చిల్లర్గి గ్రామానికి చెందిన మానయ్య నాలుగు రోజుల క్రితం చనిపోయాడు. అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు బంధువులు ఆదివారం గ్రామానికి వచ్చారు. అంగడి తిప్పేందుకు (కల్లు తాగించే ఆచా రం) మానయ్య కుటుంబ సభ్యులను తీసుకొని మొత్తం 26 మంది ట్రాలీ ఆటోలో ఎల్లారెడ్డికి వెళ్లారు. అనంతరం చిల్లర్గికి తిరిగి వస్తుండగా అన్నాసాగర్తండా సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. డ్రైవర్ సాయిలు (35), సదర్పల్లి లచ్చవ్వ (65) ఘటనాస్థలిలోనే దుర్మరణం చెందారు.
తీవ్రంగా గాయపడిన 13 మందిని బాన్సువాడ దవాఖానకు తరలించగా సాయవ్వ (45), వీరమణి (38) చనిపోయారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించిన 11 మందిలో మురగల్ల అంజవ్వ (40) మృతిచెందారు. ఇక్కడి నుంచి ఎనిమిది మందిని నిజామాబాద్ దవాఖానకు తరలించగా.. వీరమ్మ (70), గంగమణి (40), పోచయ్య(60), ఎల్లయ్య (53) మరణించారు. మిగతావారికి డాక్టర్లు చికిత్స అందజేస్తున్నారు. ఆటో డ్రైవర్ కల్లు తాగడంతోనే ప్రమాదం జరిగిందని పలువురు క్షతగాత్రులు తెలిపారు. ఎల్లారెడ్డి సీఐ శ్రీనివాస్, ఎస్సై గణేశ్ సిబ్బందితో కలిసి ప్రమాద స్థలానికి చేరుకొని క్షతగాత్రులను దవాఖానలకు తరలించారు.