Double Bedroom Housing Scheme | హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 87 వేల డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 75 వేల పైచిలుకు ఉండగా, మిగిలినవి ఇతర పట్టణాలు, గ్రామీణ ప్రాంతా ల్లో ఉన్నాయి. వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్బెడ్రూం ఇండ్లను జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో, ఇతర పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.65 లక్షల ఇండ్ల నిర్మాణం చేపట్టగా, అందులో 1.22 లక్షల ఇండ్లు పూర్తయ్యాయి. ఇప్పటికే 34 వేల పైచిలుకు ఇండ్లను పంపిణీచేయగా, మిగిలినవాటిని పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. పంపిణీ చేయాల్సిన ఇండ్లలో సింహభాగం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా నూరుశాతం సబ్సిడీపై ఇండ్లను నిర్మించి ఇస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి మౌలిక వసతులతో కలిపి రూ.6,29,000, పట్టణ ప్రాంతాల్లో రూ.6,05,000 వెచ్చించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కో ఇంటిపై రూ.7,75,000 నుంచి రూ.8,65,000 ఖర్చుచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు 50%, మైనార్టీలకు 7% రిజర్వుచేయగా, పట్టణ ప్రాంతాల్లో ఎస్సీలకు 17%, ఎస్టీలకు 6%, మైనార్టీలకు 12% రిజర్వుచేశారు.