హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): తమిళనాడు రాజధాని చెన్నైకి తాగునీటిని సరఫరా చేసేందుకు వీలుగా శ్రీశైలం రిజర్వాయర్లో 854 ఎండీడీఎల్ మెయింటెయిన్ చేయాలని ఎక్కడున్నదో చెప్పాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను తెలంగాణ ప్రభుత్వం నిలదీసింది. ఈ మేరకు రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ శనివారం లేఖను రాశారు. చెన్నైకి తాగునీటిని సరఫరా చేసేందుకు శ్రీశైలం రిజర్వాయర్లో 854 ఎండీడీఎల్ మెయింటెయిన్ చేయాల్సి ఉన్నదని ఇటీవల సమావేశాల్లో ఏపీ వాదించడంపై తెలంగాణ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది.
కేడబ్ల్యూడీటీ-1 బేసిన్ అవతలి ప్రాంతాలకు కృష్ణా జలాలను తరలించేందుకు ఎంత మాత్రం ఒప్పుకోలేదని ఈఎన్సీ మురళీధర్ స్పష్టం చేశారు. చెన్నై ప్రజల తాగునీటి అవసరాల కోసం జూలై 1 నుంచి అక్టోబర్ 31 మధ్యకాలంలో 15 టీఎంసీలకు మించకుండా తరలించాలని, అది కూడా1,500 క్యూసెక్కుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఓపెన్ కెనాల్ ద్వారా మాత్రమే కృష్ణా జలాలను తరలించేందుకు 1976-77లో అంతరాష్ట్ర ఒప్పందం జరిగిందని వివరించారు.
శ్రీశైలం రిజర్వాయర్లో ఎండీడీఎల్ 854 మెయింటెయిన్ చేయాలని ఆ ఒప్పందంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. ట్రిబ్యునల్ అవార్డును ఉల్లంఘించి ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ను ఏర్పాటు చేసిందని, ఒక్కో వెంట్ను 11,150 క్యూసెక్కుల సామర్థ్యంతో మొత్తం 14 వెంట్లను నిర్మించిందని ఈఎన్సీ మురళీధర్ గుర్తుచేశారు. ఎస్ఆర్బీసీ, బనకచర్ల రెగ్యులేటర్కు ఏ ప్రతిపాదికన టీఏసీ, సీడబ్ల్యూసీ అనుతించి ఇచ్చిందని ప్రశ్నించారు.
చెన్నైకి తాగునీటి సరఫరాను సీడబ్ల్యూసీనే పర్యవేక్షించి, క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సి ఉన్నదని పేర్కొంటూ.. ఈ అంశాలకు సంబంధించిన నివేదికలను అందించాలని కేఆర్ఎంబీని కోరారు. ఈ అంశాలపై ప్రాథమిక ఆధారాలు లేకుండా శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన రూల్ కర్వ్స్ను నిర్ధిష్టంగా రూపొందించలేమని తేల్చిచెప్పారు.