హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లో తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. నూతన ఆవిష్కరణలతో పల్లె నుంచి ఢిల్లీకి ఎంపికయ్యారు. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించిన ఇన్స్పైర్ జాతీయ ప్రదర్శనకు రాష్ట్రం నుంచి 36 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తంగా అన్ని రాష్ర్టాల నుంచి వచ్చిన ఎగ్జిబిట్లలో అత్యుత్తమైన 60 ప్రాజెక్ట్లను ఎంపికచేసి అవార్డులు అందజేశారు. ఈ 60 ప్రాజెక్ట్ల్లో 8 తెలంగాణకు చెందినవే ఉన్నాయి. ఆయా విద్యార్థులకు కేంద్ర సాంకేతికశాఖ మంత్రి జితేంద్రసింగ్ అవార్డులు అందజేశారు. ఈ 8 ప్రాజెక్ట్లను 2023 మార్చిలో ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్లో నిర్వహించే ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఆంత్రప్రెన్యూర్షిప్ (ఫైన్)లో ప్రదర్శిస్తారు.