కొత్తగా 8 మెడికల్ కాలేజీలు ప్రారంభమైంది ఇక్కడే..
సంగారెడ్డి, మంచిర్యాల, జగిత్యాల, మహబూబాబాద్, కొత్తగూడెం, నాగర్కర్నూల్, రామగుండం, వనపర్తి
‘భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో, ఇంత తక్కువ సమయంలో ఎనిమిది మెడికల్ కాలేజీలు సిద్ధంకావడం, అవి ఒకేరోజు ప్రారంభం కావడం అరుదైన సందర్భం.. భవిష్యత్తులో కరోనా వంటి మహమ్మారులు, వైరస్లు వచ్చినా.. ప్రజలకు రక్షణగా ఉండే గొప్ప వైద్య కవచాన్ని విద్యార్థుల రూపంలో అందించాలనే లక్ష్యంతో జిల్లాకో మెడికల్ కాలేజీ అనే బృహత్ ప్రయత్నానికి శ్రీకారం చుట్టాం.. పేదల ఆరోగ్య రక్షణ ప్రభుత్వ బాధ్యత. కాబట్టి ఎంత ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం వెనుకాడదు.’
– ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): భవిష్యత్తులో కరోనా వంటి మహమ్మారులు, వైరస్లు వచ్చినా ప్రజలకు రక్షణ కల్పించేలా గొప్ప వైద్య కవచాన్ని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ఇందులో భాగంగానే జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటుచేసిన ఎనిమిది వైద్య కళాశాలల్లో విద్యాబోధనను సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్ నుంచి ఆన్లైన్లో ప్రారంభించారు. దేశ వైద్యరంగంలోనే నూతన అధ్యాయాన్ని లిఖించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఒకేరోజు ఎనిమిది మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవడం చాలా గర్వకారణం. దేశంలోనే అరుదైన సందర్భం’ అని పేర్కొన్నారు. విద్యార్థులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు కృషి చేసిన వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావుతోపాటు ఉన్నతాధికారులను ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయమని, మరిచిపోలేని రోజు అని అభివర్ణించారు. ఒకప్పుడు అనేక సమస్యలతో తాగునీటికి, సాగునీటికి, కరెంటుకు, మెడికల్ సీటుకు, ఇంజనీరింగ్ సీటుకు ఎన్నో అవస్థలు పడ్డామని గుర్తు చేశారు. నేడు స్వరాష్ట్రంలో అద్భుతంగా ఆత్మగౌరవంతో బతుకుతూ దేశానికి మార్గదర్శనం చేసేలా అనేక వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నామని వివరించారు. అన్ని రంగాల్లో తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తున్నదని, వైద్యరంగంలో కూడా దేశం అనుకరించేవిధంగా యువ రాష్ట్రమైన తెలంగాణ ఎదగడం చాలా సంతోషంగా ఉన్నదని చెప్పారు.
ప్రగతిభవన్ నుంచి ఒకేసారి 8 మెడికల్ కాలేజీల్లో తరగతులను మంగళవారం ఆన్లైన్లో ప్రారంభించిన సందర్భంగా సీఎం కేసీఆర్కు పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలియజేస్తున్న మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, కాళోజీ వైద్య వర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి.
రాష్ట్ర ఏర్పాటుతోనే సాధ్యమైంది
మహబూబాబాద్, వనపర్తి వంటి ప్రాం తాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు వస్తాయని కలలో కూడా ఎవరూ ఊహించలేదని సీఎం కేసీఆర్ అన్నారు. స్వరాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమకారులుగా పనిచేసిన బిడ్డలే తెలంగాణ పరిపాలన సారథ్యాన్ని చేపట్టడం వల్లే మన కలలు సాకారం అవుతున్నాయని చెప్పారు. గతంలో మహబూబ్నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలు ప్రారంభించుకున్నామని, వాటిని విజయవంతంగా నిర్వహించుకుంటున్నామని గుర్తుచేశారు. ‘ఈరోజు సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్కర్నూల్, రామగుండంలో కొత్తగా మెడికల్ కాలేజీలు ప్రారంభించుకున్నాం. తెలంగాణ ఉద్యమకారుడు, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు కృషితోనే ఇవి రూపుదాల్చాయి. ఆయన కృషి అపురూపం’ అని ప్రత్యేకంగా అభినందించారు. కాలేజీల ఏర్పాటుకు సహకరించిన సీఎస్ సోమేశ్కుమార్, డీఎంఈ రమేశ్రెడ్డి, హెల్త్ సెక్రటరీ రిజ్వి, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బందికి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.
రెండేండ్లలో మరో 17 కాలేజీలు
రాష్ట్రంలో జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్నదే తమ సంకల్పమని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రస్తుతం 16 జిల్లాల్లో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయని వివరించారు. మరో రెండేండ్లలో మిగతా 17 జిల్లాల్లో నూతన మెడికల్ కాలేజీలు ఏర్పాటవుతాయని స్పష్టంచేశారు. ‘రాబోయే రోజుల్లో మిగిలిన 17 కాలేజీల నిర్మాణం కూడా చేపట్టి, భగవంతుడు మన్నిస్తే వీటి ప్రారంభోత్సవం కూడా నేనే చేస్తా’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘తెలంగాణలో ఏ మారుమూల అయినా మనదే.. ఏ ఇంచు అయినా మనదే.. యావత్ తెలంగాణ అభివృద్ధి జరగాలన్నదే మన అభిమతమ’ని పేర్కొన్నారు. ములుగు, భూపాలపల్లి జిల్లాలు ఒకే నియోజకవర్గంలో ఉన్నప్పటికీ, అవి సమగ్రాభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో రెండు ప్రాంతాల్లోనూ మెడికల్ కాలేజీలను మంజూరు చేశామని వివరించారు. ‘మనం ఏ స్కీమ్ తెచ్చుకున్నా ఆ ఊరు.. ఈ ఊరు అని చిల్లర వివక్ష లేకుండా అభివృద్ధి చేసుకుంటున్నాం. దానికి ప్రతిరూపమే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ. వాటివల్ల ప్రతి ఊరికీ లబ్ధి కలిగింది’ అని పేర్కొన్నారు.
విద్యార్థులకు మంచి అవకాశం
మెడికల్ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్రంలో ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు గణనీయంగా పెరిగాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు 850 నుంచి 2,790కి, పీజీ సీట్లు 531 నుంచి 1,180కి, సూపర్ స్పెషాలిటీ సీట్లు 70 నుంచి 152కి పెరిగాయని వెల్లడించారు. దీంతో విద్యార్థులకు ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ‘ముఖ్యంగా రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూళ్ల నుంచి వస్తున్న రత్నాల్లాంటి, వజ్రల్లాంటి విద్యార్థులకు ఇది మంచి అవకాశం. దళిత, గిరిజన, బడుగు బలహీన, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఇదొక మంచి అవకాశం’ అని పేర్కొన్నారు.
నర్సింగ్ విద్యకూ ప్రాధాన్యం
‘జనాభా నిష్పత్తికి అనుగుణంగా డాక్టర్లు అందుబాటులో ఉండటం ఎంత అవసరమో, పారా మెడికల్ సిబ్బంది కూడా అంతే అవసరం. అది వైద్య రంగ పటిష్ఠతను సూచిస్తుంది’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో వైద్య రంగాన్ని పటిష్ఠం చేసేందుకు మెడికల్ కాలేజీలతో సమానంగా, సమతూకంగా నర్సింగ్ కాలేజీలను కూడా ప్రతి జిల్లాకు ఒకటి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీంతోపాటు పారామెడికల్ కోర్సులను సైతం విస్తృతం చేస్తున్నామని వెల్లడించారు. ‘కరోనా విపత్తు సృష్టించిన భయోత్పాతాన్ని మనం చూశాం. అమెరికా, యూరప్ దేశాలు కూడా ఆ మహమ్మారిని తట్టుకోలేకపోయాయి. రాబోయే రోజుల్లో ఇలాంటివి ఇంకా వస్తాయని నిపుణులు చెప్తున్నారు. వాళ్లని పరిష్కారం అడిగితే.. ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో వైద్య వ్యవస్థ పటిష్ఠంగా ఉంటుందో వారికి తక్కువ నష్టం సంభవిస్తుంది అని చెప్పారు. అందుకే.. భవిష్యత్తులో తెలంగాణకు వైరస్ల బెడద రాకూడదని, విద్యార్థుల చదువు ప్రజల సేవకు ఉపయోగపడాలని, వైద్య వ్యవస్థ పటిష్ఠం కావాలని, ఎలాంటి మహమ్మారులు వచ్చినా ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా రక్షణగా ఉండే గొప్ప వైద్య కవచాన్ని విద్యార్థుల రూపంలో ఉండేలా జిల్లాకో మెడికల్ కాలేజీ అనే బృహత్ ప్రయత్నానికి శ్రీకారం చుట్టాం’ అని సీఎం కేసీఆర్ వివరించారు.
చాలా గొప్ప ఆశయంతో, సమాజ శ్రేయస్సు, సమాజ రక్షణ, పేదల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వేల కోట్లు వెచ్చించి మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నదని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పారామెడికల్ కాలేజీలు త్వరలోనే ప్రారంభించేలా మంత్రి హరీశ్రావు చర్యలు చేపడుతారని తెలిపారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వైద్యరంగానికి చెందిన విద్యార్థులు, అధ్యాపకులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్సీలు ఎస్ మధుసూదనాచారి, తాతా మధు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వర్రావు, డాక్టర్ సంజయ్కుమార్, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్రెడ్డి, డీఎంఈ రమేశ్రెడ్డి, డీపీహెచ్ శ్రీనివాసరావు, సీఎం ఓఎస్డీ గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ట్రెండింగ్లో ఆరోగ్య తెలంగాణ
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఒకేరోజు ఎనిమిది మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. ‘ఆరోగ్య తెలంగాణ’ హ్యాష్ట్యాగ్తో ట్వీట్లు వేస్తూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. మంగళవారం ఈ హ్యాష్ట్యాగ్ ట్విట్టర్లో సుమారు 5 గంటలపాటు దేశంలోనే నంబర్ వన్ స్థానంలో కొనసాగింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల్లోనూ ఈ హ్యాష్ట్యాగ్ విపరీతంగా ట్రెండింగ్ అయ్యింది. ప్రముఖ సోషల్ మీడియా హ్యాష్ట్యాగ్ విశ్లేషణ వెబ్సైట్ ‘బ్రాండ్ మెన్షన్స్’ ప్రకారం.. ఆరోగ్య తెలంగాణ హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియా ద్వారా మంగళవారం ఒక్కరోజే సుమారు 51 లక్షల మంది నెటిజన్లకు చేరింది. దాదాపు 51 వేల మంది ఈ హ్యాష్ట్యాగ్తో పోస్టులు పెట్టారు. ఇందులో 70% ట్విట్టర్లో, 20% ఇన్స్టాగ్రామ్లో నమోదయ్యాయి. దేశ చరిత్రలోనే ఇది సువర్ణ అధ్యాయమని పలువురు నెటిజన్లు కొనియాడారు. కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకపోయినా తెలంగాణ రాష్ట్రం సొంతంగా 8 కాలేజీలు నిర్మించుకొన్నదని పేర్కొన్నారు.
వైద్య రంగంలో సువర్ణ అధ్యాయం: కేటీఆర్
సీఎం కేసీఆర్ ఒకేరోజు 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించడం వైద్య, ఆరోగ్య రంగంలో సువర్ణ అధ్యాయమని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. 57 ఏండ్ల ఉమ్మడి పాలనలో కేవలం 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం కేవలం 8 ఏండ్లలోనే 12 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అధికారులు, సిబ్బంది కృషిని ప్రశంసించారు. కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్న సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.