హైదరాబాద్, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ విధానాలు బిందు సేద్యానికి శాపంగా మారుతున్నాయి. డ్రిప్ రైతులను కష్టాలకడలిలోకి ఈడ్చుకెళ్తున్నాయి. ఒకవైపు కం పెనీలు డ్రిప్ సిస్టం ధరలను అమాంతం పెంచగా, మరోవైపు కేంద్రం 12 శాతం జీఎస్టీ విధించి నడ్డి విరుస్తున్నది. మార్కెట్ ధరలకు అనుగుణంగా డ్రిప్ యూనిట్ కాస్ట్ను పెంచి, ఆ మేరకు సబ్సిడీ రూపంలో ఆదుకొనేందుకు కేంద్రం నిరాకరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను పెడచెవిన పెడుతున్నది. కేంద్ర ప్రభుత్వ వైఖరి రాష్ట్రంలో సుమారు 8 లక్షల మంది డ్రిప్ రైతులకు అశనిపాతంలా మారింది. ముఖ్యంగా ఆయిల్పాం రైతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ నేపథ్యంలో డ్రిప్ రైతులను ఆదుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. యూనిట్ కాస్ట్ను పెంచడమే కాకుండా కేంద్రం విధిస్తున్న జీఎస్టీ భారాన్ని సైతం రాష్ట్రమే భరిస్తున్నది.
100% పెరిగిన డ్రిప్ ధర
పీవీసీ ముడి సరుకు ధరలు భారీగా పెరగడంతో కంపెనీలు డ్రిప్ యూనిట్ ధరలను
అమాంతం పెంచాయి. గతంలో ఒక హెక్టారు(రెండున్నర ఎకరాలు)కు సరిపోయే యూనిట్ ధర రూ.25వేల వరకు ఉండగా ప్రస్తుతం అది రూ.54వేలు దాటింది. ఏకంగా 100 శాతానికి పైగా ధర పెరిగింది. ఇందుకు అనుగుణంగా కేంద్రం కూడా యూనిట్ కాస్ట్ను పెంచితే.. ఆ మేరకు సబ్సిడీ లభించి రైతులకు ఉపశమనం లభిస్తుంది. అధిక ధరల నుంచి రైతులను ఆదుకొనేందుకు డ్రిప్ యూనిట్ కాస్ట్ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్లో నిర్వహించిన ఆయిల్పాం సమ్మిట్కు హాజరైన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్తోమర్కు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి స్వయంగా వినతిపత్రం అందజేశారు. అయినప్పటికీ కేంద్రం స్పందించడం లేదు. రైతులను ఆదుకొనేందుకు ముందుకురావడం లేదు.
రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
డ్రిప్ రైతులకు కేంద్రం మొండిచేయి చూపినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. రైతుల ఇబ్బందులను తీర్చేందుకు స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. డ్రిప్ ధరలను పెంచుతూ కొన్ని నెలల క్రితం నిర్ణయం తీసుకున్నారు. 9X9 ట్రయాంగులర్ డ్రిప్ యూనిట్ కాస్ట్ను రూ.53,465కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ కేంద్రం మాత్రం రూ.27,304ల పాత ధరనే నిర్ణయించడం గమనార్హం. మొత్తం డ్రిప్ ధర రూ.53,465లో కేంద్రం సబ్సిడీగా రూ.8,191 మాత్రమే చెల్లిస్తున్నది. దీనికి తోడు కేంద్రం డ్రిప్పై 12% జీఎస్టీ విధిస్తున్నది. ఇందులో తాము కేవలం 5% లేదా గరిష్ఠంగా రూ.5 వేలు మాత్రమే చెల్లిస్తామని కేంద్రం చెప్తున్నది. దీంతో రైతులపై జీఎస్టీ రూపంలో మరో భారం పడినట్టయ్యింది. ఈ నేపథ్యంలో రైతులపై భారం పడకుండా కాపాడేందుకు ఆ జీఎస్టీని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది. ఈ విధంగా ప్రతి యూనిట్కు రూ.2,673 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో యూనిట్కు రూ.47,947 చొప్పున భరిస్తూ డ్రిప్ రైతులను ఆదుకొంటున్నది.