హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో 2014లో జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అత్యధికంగా 74.20% పోలింగ్ నమోదైంది. 1983 నుంచి 2018 వరకు జరిగిన సాధారణ ఎన్నికల్లో అదే అత్యధిక పోలింగ్ శాతం. 1983 నుంచి జరిగిన 9 ఎన్నికల్లో సాధారణ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే సగటున 67.57% పోలింగ్ నమోదైంది. ఈ సారి అత్యధిక పోలింగ్ శాతం నమోదవుతుందనే అంచనాలున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 3.26 కోట్ల ఓటర్లు ఉన్నారు. ఈసారి ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేశారు. చనిపోయినవారి పేర్లు తొలగించడం, ఒకటికి మించిన నియోజకవర్గాల్లో ఓటుహక్కు ఉన్న వారిని గుర్తించి వారి కోరిక మేరకు ఏదో ఒకచోటనే ఓటర్ల జాబితాలో పేరు ఉంచి, మిగతా చోట్ల తొలిగించడం లాంటి చర్యలు చేపట్టారు. రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి అనర్హుల ఓట్లను తొలిగించారు. దీనికితోడు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరుతూ ప్రచారం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కూడా పోలింగ్ శాతం పెంపుదలపై దృష్టి సారించారు. దివ్యాంగులు, 80 ఏండ్లు దాటిన వారికి ఇంటి వద్దనే ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా 28 వేల మంది ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు.