భద్రాచలం, అక్టోబర్ 13: ‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులకు గిరిజన విద్యార్థులకు వండిపెట్టే హాస్టల్ కార్మికుల ఆకలి బాధలు కనిపించడం లేదా?’ అని డైలీవైజ్, అవుట్సోర్సింగ్ వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ మధు ప్రశ్నించారు. ‘ఓట్లేసి గెలిపించిన పాపానికి గిరిజన కార్మికుల నోటికాడి బువ్వను గుంజుకుంటూ వారి జీతాలు తగ్గిస్తారా? అంటూ ధ్వజమెత్తారు.
తమ సమస్యలు పరిష్కరించాలని, జీవో 64 రద్దు చేయాలని, జీవో 60 ప్రకారం నెలకు రూ.15,600 వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ 32 రోజులుగా గిరిజన ఆశ్రమ పాఠశాలల కార్మికులు, అవుట్ సోర్సింగ్ వర్కర్లు ఎక్కడికక్కడ నిరవధిక సమ్మె చేస్తున్నారు. భద్రాచలం ఐటీడీఏ ఎదుట 72 గంటలపాటు మహాధర్నా నిర్వహించాలని, అక్కడే వాంటావార్పు చేయాలని నిర్ణయించారు. సోమవారం ఉదయమే భద్రాచలానికి చేరుకున్న భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల కార్మికులు ఐటీడీఏ ఎదుట బైఠాయించారు. కార్మికులు తమ శిబిరం వద్దే భారీ వర్షంలోనూ వంటావార్పు చేశారు.