MGNREGS | హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): కేంద్రం వివక్ష కారణంగా తెలంగాణలో ఉపాధి హామీ కూలీలు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అరకొరగా కేటాయించిన పని దినాలు కేవలం మూడు నెలల్లోనే అయిపోయాయి. ఈ ఏడాది 12 కోట్ల పని దినాలు అవసరమని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోలేదు. రాష్ట్రంలో పని డిమాండ్పై అవగాహన, ముందుచూపు లేకుండా 7 కోట్ల పని దినాలు మాత్రమే మంజూరు చేసింది. ఈ వేసవిలో ఉపాధి హమీ పనులకు కూలీలు భారీగా హాజరు కావడంతో.. ఆవి మూడు నెలల్లోనే పూర్తయ్యాయి. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు 7.01 కోట్ల పనిదినాలను కూలీలు ఉపయోగించుకొన్నారు.
ఈ నేపథ్యంలో మరో 5 కోట్ల పనిదినాలు ఇవ్వాలని రాష్ట్రం కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నది. 2022-23లో 12.18 కోట్లు, 2021-22లో 14.42 కోట్లు, 2020-21లో 15.64 కోట్ల పని దినాలను రాష్ట్రంలోని కూలీలు పూర్తిచేసుకొన్నది. ఉపాధి హామీ చట్టం ప్రకారం కూలీలు ఎన్ని రోజులు పని చేస్తామంటే అన్ని రోజులు పని కల్పించాల్సి ఉంటుంది. ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ రాష్ట్రం ముందున్నది. దీని ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నది. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం తెలంగాణపై కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నది.