తొలి నాళ్ల బౌద్ధానికి గోదారమ్మ నెలవైంది. మహాయాన బౌద్ధ వికాసానికి కృష్ణమ్మ సాక్ష్యమైంది. శాతవాహన కాలానికి గోదారి ప్రతినిధి అయితే, ఇక్షాకులు, విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులకు కృష్ణవేణి ఆతిథ్యమిచ్చింది. చారిత్రాత్మక ఘట్టాలకు వేదికలైన అదే గోదావరి, కృష్ణవేణి తెలంగాణలో కరువు, కాటకాలకు మౌనసాక్షిగానూ నిలిచాయి. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణం.
మనిషి నాగరికతకు, ప్రాచీన సంస్కృతికి జలమే జీవనాధారం. ఆ జలాన్ని అశ్రద్ధ చేసిన నాడు.. ప్రళయరూపంలో విరుచుకుపడుతుంది. అమృతంగా భావించి ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపడితే, స్వర్గమే పాదాక్రాంతమౌతుంది.
కేసీఆర్ పాలనలో నీటి సవ్వడులతో తెలంగాణ జలభాండాగారమైంది. ముంచెత్తే వరదలు, తాండవించే కరువులకు చరమగీతం పాడింది. ఇది ఒక్కరోజులో సాకారమైంది కాదు. పదేండ్ల అకుంఠిత దీక్ష, నిబద్ధతతోనే ఆవిష్కృతమైంది.
Telangana | పర్యావరణ మార్పుల కారణంగా అతివృష్టి, అనావృష్టితో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వరదలు, కరువు కాటకాలతో కడగండ్ల పాలవుతున్నారు. ఒక్కసారిగా మీద పడే వరదలతో వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నది. ఆ వెంటనే తీవ్ర కరువుతో గొంతు తడపడానికి గుక్కెడు నీళ్లు దొరకని దుస్థితి కూడా దాపురిస్తున్నది. దీంతో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన ఆవశ్యకతను పలు అధ్యయనాలు నొక్కిచెబుతున్నాయి. విస్తృతంగా జలాశయాలను నిర్మిస్తే వరుసగా కరువు వచ్చినా తట్టుకొనే పరిస్థితి ఉంటుంది. అదీగాక భారీగా వచ్చే వరదను నియంత్రించే అవకాశం కూడా లభిస్తున్నది. భూగర్భ జలాల పెరుగుదలతో పాటు అనుబంధ రంగాల వృద్ధి యథావిధిగా పెరుగుతున్నది. ఈ ప్రయోజనాలను ముందుగానే గుర్తించిన కేసీఆర్ సర్కారు ఈ పదేండ్లలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. తెలంగాణ జల భాండాగారంగా మారింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వాలు తెలంగాణ ఎత్తిపోతల పథకాల్లో తగినంత నిల్వ సామర్థ్యం ఏర్పాటు చేయాలన్న అంశంపై ఎన్నడూ దృష్టి పెట్టలేదు. పైగా ఉన్న గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఫలితంగా తెలంగాణ దశాబ్దాల పాటు తీవ్ర కరువును ఎదుర్కొన్నది. స్వరాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ నీటి నిల్వ సామర్థ్యం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎకడ అనుకూలత ఉంటే అకడ జలాశయాలు నిర్మిస్తూ తెలంగాణను జలభాండాగారంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ జలాశయాలు, గోదావరిపైన వరుస బరాజ్లను నిర్మించారు.
ఫలితంగా ఆ ఒక్క ప్రాజెక్టు ద్వారానే రాష్ట్రంలో నీటి నిల్వ సామర్థ్యం ఇప్పటికే 141 టీఎంసీలకు పైగా పెరిగింది. ఇంకా అనేక జలాశయాల నిర్మాణానికి ప్రతిపాదనలు చేయడమే కాకుండా ఆ పనులను చకచకా పూర్తి చేస్తున్నారు. అదీగాక అవకాశం ఉన్నచోట చెరువుల సామర్థ్యాన్ని కూడా భారీగా విస్తరిస్తుండడమే గాక, సాగునీటి ప్రాజెక్టులతో వాటిని అనుసంధానం చేస్తున్నారు. వాగులన్నింటిపైనా చెక్డ్యాంలను నిర్మిస్తున్నారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు రాడార్లోనే 500 టీఎంసీలకు పైగా నీటిని నిల్వ చేసుకునే స్థాయికి తెలంగాణ ఎదిగింది.
గతంలో కృష్ణా, గోదావరి బేసిన్లోని కొన్ని ప్రాంతాలకే రిజర్వాయర్లు పరిమితమయ్యాయి. ఆయా నదులు, ఉపనదుల పైన, పెద్దవాగుల పైనే మేజర్, మీడియం ప్రాజెక్టులను నిర్మించారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం అందుకు భిన్నంగా రాష్ట్రంలోని నలుమూలలా రిజర్వాయర్లను నిర్మిస్తుండడం విశేషం. నదులు, ఉపనదుల మీదనే కాకుండా ఆఫ్లైన్ రిజర్వాయర్లకు కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, నల్గొండ జిల్లాల్లో బస్వాపూర్ ఇలా చెప్పుకుంటూ అనేక రిజర్వాయర్లను ప్రభుత్వం నిర్మించింది. ఇవి కాకుండా మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికతీత చేపట్టి రాష్ట్రంలో 9.14 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచింది. చెక్డ్యాంల ద్వారా కూడా నీటి నిల్వకు ప్రభుత్వం పాటుపడుతున్నది. అవన్నీ కూడా భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతుతున్నాయి. మత్స్య, పాడి పరిశ్రమ, గొర్ల పెంపకంతో పాటు టూరిజం తదితర రంగాలకూ ఊతమిస్తూ ఉపాధి బాటలు పరుస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రం అత్తెసరు నీటి నిల్వ సామర్థ్యంతో, అసలు నీటి నిల్వ వెసులుబాటు లేకుండానే నిర్మించిన, ప్రతిపాదించిన ప్రాజెక్టులపైనా నీటి నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాలను కేసీఆర్ ప్రభుత్వం నిర్మించింది. ఇవన్నీ రాష్ట్రంలో నీటి లభ్యతను, నిల్వ సామర్థ్యాన్ని క్రమంగా పెంచుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో కృష్ణా, గోదావరి బేసిన్లలో కలిపి మొత్తం నీటి లభ్యత 1300 టీఎంసీలు కాగా, నిల్వ సామర్థ్యం 950 టీఎంసీలు. తలసరి నీటి లభ్యత 9.20 లక్షల లీటర్లు కాగా, నిల్వ 6.72 లక్షల లీటర్లు. రాష్ట్ర నీటి నిల్వ సామర్థ్యం జాతీయ సగటును మించిపోయింది. ఆ విషయంలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నది. కరువనేదే లేని నేలగా మారుతున్నది.
తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, నీటి వనరులపై సంపూర్ణ అవగాహన కలిగిన నిపుణులతో అనేక సంప్రదింపులు జరిపిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని కొమురవెల్లి మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్లు కాకతీయుల స్ఫూర్తిని చాటుతాయి. ఇప్పుడు పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో నిర్మించిన ఐదు రిజర్వాయర్లు కూడా అదే తరహాలో ఉండడం విశేషం. గతంలో ప్రాజెక్టుల నిర్మాణంలో గ్రామాలకు గ్రామాలే ముంపునకు గురయ్యేవి. వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వీలైనంత వరకు అతితక్కువ ముంపుతో గుట్టల నడుమ, గుట్టలను కలుపుతూ కట్టలను నిర్మించి రిజర్వాయర్లను తీర్చిదిద్దడం విశేషం.
కేసీఆర్ ప్రభుత్వం సాధించిన మరో అద్భుతమైన విజయం.. కృష్ణా బేసిన్లోనూ గతంలో ఎన్నడూలేని రీతిలో నీటి నిల్వ సామర్థ్యం పెరగడం. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు కుట్రపూరితంగా తెలంగాణ ప్రాంతంలో నీటి నిల్వకు ఎక్కడా అవకాశం లేకుండా చేశారు. జూరాల మినహా మరే భారీ ప్రాజెక్టు, రిజర్వాయర్ను నిర్మించలేదు. ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకాల్లోనూ నీటి నిల్వ సామర్థ్యం అంతంతమాత్రమే. మొత్తంగా గతంలో నిజాం హయాంలో నిర్మించిన అన్ని మీడియం, మైనర్ ప్రాజెక్టులు కలుపుకున్నా తెలంగాణలో 24 టీఎంసీలకు మించి నీటి నిల్వకు అవకాశం ఉండేది కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో కేవలం ఒక్క పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారానే ప్రస్తుతం అదనంగా 67.97 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరగడం విశేషం. మొత్తంగా 6 రిజర్వాయర్లను ప్రభుత్వం ప్రతిపాదించగా, ఇప్పటికే అందులో కేపీ లక్ష్మీదేవిపల్లి (2.5) మినహా 65.25 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన మిగతా 5 రిజర్వాయర్లు పూర్తి చేయడం విశేషం.
నీటి నిల్వ సామర్థ్యం (టీఎంసీల్లో)
…? మ్యాకం రవికుమార్