హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): కరోనా బాధిత కుటుంబాల్లోని పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం మానవీయ స్పర్శ అందిస్తున్నది. వైరస్ బారినపడిన తల్లిదండ్రులు దవాఖానల్లోనో, ఐసోలేషన్ కేంద్రాల్లోనో చికిత్స పొందుతుంటే వారి పిల్లల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థం. ఈ సమస్యకు పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినవే ట్రాన్సిట్హోమ్స్. స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొత్తం 66 హోమ్స్ ఏర్పాటుచేశారు. ఇందులో ఏడు హైదరాబాద్లో ఉన్నాయి. వైరస్బారిన పడి చికిత్స పొందుతున్నవారి పిల్లలకు కరోనా సోకలేదని రిపోర్టులో తేలితే.. ఆయా పిల్లలను ఈ ట్రాన్సిట్హోమ్లో చేర్చుకొని, వారిని సంరక్షిస్తారు.
ట్రాన్సిట్ హోమ్ సేవల కోసం ప్రత్యేక హెల్ప్డెస్క్ నంబర్: 040-23733665 లేదా స్త్రీ, శిశు సంక్షేమశాఖ వారి హెల్ప్డెస్క్ 1098 నంబర్కు ఫోన్చేయవచ్చు. అయితే, ప్రత్యేక హెల్ప్డెస్క్కు ఉదయం9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు ఫోన్చేసే వీలున్నది. ఈ డెస్క్ ప్రారంభమైన తొలిరోజు శనివారంనాడు కరోనాబారిన పడ్డ హైదరాబాద్ నల్లకుంటకు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లల సంరక్షణ కోసం కాల్చేశారు. దీంతో వీరి ఇద్దరు కొడుకులను (ఒకరు 8 ఏండ్లు, మరొకరు 12 ఏండ్లు) సికింద్రాబాద్లోని డాన్బోస్కో ట్రాన్సిట్ హోం ఫర్ బాయ్స్లో చేర్పించారు.
ఈ ట్రాన్సిట్ హోమ్లో కరోనా పరీక్షల్లో నెగెటివ్ ఉన్న పిల్లలనే చేర్చుకొంటారు. ఒకవేళ తల్లిదండ్రులతోపాటు పిల్లలకు కూడా పాజిటివ్ వస్తే అటువంటి పిల్లలను అమీర్పేటలోని నేచర్క్యూర్, కొండాపూర్, రామాంతాపూర్ ఏరియా దవాఖానల్లో చేర్పించి, చికిత్స అందిస్తారు. కరోనా బాధిత కుటుంబాల్లోని పిల్లల కోసం ఇలాంటి హోమ్లు ఏర్పాటుచేసిన తొలి రాష్ట్రం తెలంగాణ కావడం విశేషం.
ట్రాన్సిట్ హోమ్స్ పిల్లలకు రక్షణ కవచాలుగా, సౌకర్యవంతంగా ఉండాలని ప్రభు త్వం భావిస్తున్నది. పిల్లలు ఇల్లు, తల్లిదండ్రుల మీద బెంగ పడకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నది. పిల్లలకు పౌష్టికాహారం అందిస్తుంది. వారి తల్లిదండ్రులతో మాట్లాడేందుకు వీలుగా వర్చువల్ వీడియో కాలింగ్ సౌకర్యం కల్పించింది. పిల్లలకు మానసిక రుగ్మతలు దరిచేరకుండా అన్ని హోమ్స్లో మానసిక వైద్య నిపుణులతో కౌన్సెలింగ్ నిర్వహించే విధంగా ఏర్పాట్లుచేశారు. పిల్లల్లో మానసిక, శారీరక ఉల్లాసానికి అవసరమైన ఆటలాడించే ఏర్పాట్లున్నాయి.