హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రవాణా శాఖ రాబడి గణనీయంగా పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.6,390.80 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది 2021-22లో వచ్చిన రూ.3,971.38 కోట్ల రాబడి కంటే 60.92 శాతం అధికం. కొవిడ్ అనంతరం రాష్ట్రంలో వ్యక్తిగత వాహనాల కొనుగోళ్లు బాగా పెరిగాయి. వీటి రిజిస్ట్రేషన్లతోపాటు కొవిడ్ సమయంలో పెండింగ్లో ఉన్న త్రైమాసిక పన్నులు, బిల్లుల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ను చేపట్టడంతో రవాణా శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.466.38 కోట్లుగా ఉన్న త్రైమాసిక పన్ను రాబడి 2022-23లో రూ.779.09 కోట్లకు పెరిగింది. లైఫ్ట్యాక్స్ రూ.2896.14 కోట్ల నుంచి రూ.4670.04 కోట్లకు, గ్రీన్ ట్యాక్స్ రూ.5.54 కోట్ల నుంచి రూ.64.63 కోట్లకు పెరిగింది. ఫీజులు 31.90%, డిటెక్షన్ 192.44%, యూజర్ ఛార్జీలు 12.66% వృద్ధి చెందాయి.