హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కమిషన్ మార్గనిర్దేశనంలో రాష్ట్ర పోలీసులు 24/7 విధులు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 9వ తేదీ నుంచి ఆదివారం వరకు పోలీసుల స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ 400 కోట్లకు చేరింది. వీటిల్లో రూ.171 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.187 కోట్ల నగదు, రూ.17 కోట్ల డ్రగ్స్, రూ.9 కోట్ల మద్యం, రూ.16 కోట్ల ఇతర ఉచితాలను స్వాధీనం చేసుకున్నారు. 2018 ఎన్నికల్లో రూ.120 కోట్లకుపైగా నగదు, బంగారు, డ్రగ్స్, మద్యం పట్టుబడింది. తాజా ఎన్నికల సందర్భంగా ఆదివారం వరకు స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.625.79 కోట్లకు చేరింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రూ.22.46 కోట్ల విలువైన మద్యం, నగదు, బంగారు ఆభరణాలు, ఉచితాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.