హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): దేశంలో అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఏటా పెరుగుతున్నాయి. గత ఐదేండ్లలో 61 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడినట్టు కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. 2023లోనే ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 2019, 2022 సంవత్సరాల్లో అత్యధికంగా 16 మంది చొప్పున విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ‘2018 -23 మధ్యకాలంలో ఐఐటీల్లో 33 మంది, ఎన్ఐటీల్లో 24 మంది, ఐఐఎంలలో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విద్యాపరమైన ఒత్తిడి, కుటుంబ కారణాలు, మానసిక సమస్యలతోనే విద్యార్థులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు’ అని పేర్కొన్నది.