కొత్తగూడెం క్రైం, మార్చి 27: తుపాకుల మోతతో ఛత్తీస్గఢ్ దండకారణ్యం దద్దరిల్లింది. బుధవారం భద్రతా దళాల ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా బాసగూడ నదీ ప్రాంతంలో రెండు రోజుల క్రితం ఇన్ఫార్మర్ల నెపంతో ముగ్గురు గ్రామస్తులను మావోయిస్టులు హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఆ ప్రాంతంలోనే తలదాచుకున్నారన్న సమాచారంతో చీపురుభట్టి అడవుల్లో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.
ఫుట్కేల్-త్రిపురపట్టి ప్రాంతంలో తారసపడిన మావోయిస్టులు భద్రతా దళాలపైకి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు. మావోయిస్టులు తప్పించుకున్న అనంతరం ఘటనా స్థలం లో ఆరుగురి మృతదేహాలతోపాటు ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఓ అనుమానితుడిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది. మృతిచెందిన మావోయిస్టులను నగేశ్, అతడి భార్య సోని, వికాస్, సుక్కా, ముక్కా, గంగిగా పోలీసులు గుర్తించారు.