66 మంది దళితుల ఖాతాల్లో రూ.6.6కోట్లు
దళిత కుటుంబాల్లో వెల్లివిరిసిన సంబురాలు
యాదాద్రి భువనగిరి : మొన్న హుజూరాబాద్.. నేడు వాసాలమర్రి.. దళిత కుటుంబాల్లో వెల్లివిరుస్తోన్న ఆనందం. దళిత బంధు డబ్బులు దళితుల ఖాతాల్లో జమ కావడంతో.. ఆ బిడ్డల సంతోషం ఉప్పొంగుతోంది. కేసీఆర్ మా పాలిట దేవుడు అని నీరాజనాలు పలుకుతున్నారు. దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన తుర్కపల్లి మండలం వాసాలమర్రి దళిత వాడల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. వాసాలమర్రి గ్రామంలోని 66 దళిత కుటుంబాల ఖాతాల్లో రూ. 6.6 కోట్ల నగదు జమ అయింది. గురువారం ఉదయం నుంచి వారి సెల్ఫోన్లకు బ్యాంక్ నుంచి ఎస్ఎంఎస్లు వస్తుండటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక తమ కాళ్ళ మీద తాము నిలబడేలా పౌల్ట్రీ, డెయిరీ ఫామ్ తదితర యూనిట్లను లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నారు. ఈ మేరకు ఆయా యూనిట్లపై అవగాహన కల్పించేందుకు అధికారులు గురువారం లబ్ధిదారులను బస్సులో క్షేత్ర స్థాయి పర్యటనకు తీసుకెళ్లారు.