హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధి దొరక్క తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న చేనేత, పవర్లూమ్ కార్మికులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మంచిరోజులొచ్చాయి. ఆధునిక యంత్రాలతో బడా కంపెనీలు వస్ర్తాల తయారీ రంగంలోకి రావడంతో ఆత్మహత్యలే శరణ్యమనుకొన్న నేతన్నలకు సీఎం కేసీఆర్ చేతినిండా పని కల్పించి ఆదుకొన్నారు. ప్రభుత్వ శాఖలకు అవసరమయ్యే వస్ర్తాలే కాకుండా బతుకమ్మ చీరలను వారితో నేయించి ఏడాది పొడవునా ఉపాధి చూపించారు.
తద్వారా నెలకు కనీసం రూ.20 వేలకు తగ్గకుండా ఆర్థిక ప్రయోజనం కలిగే ఏర్పాటు చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఆరేండ్లలో రూ.1,804 కోట్లు వెచ్చించింది. తెలంగాణలో ఎంతో ఘనంగా జరుపుకొనే బతుకమ్మ పండుగను స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. 18 ఏండ్లు పైబడిన పేద మహిళలకు గత ఆరేండ్ల నుంచి ఉచితంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న విషయం విదితమే.
ఈ చీరల తయారీ బాధ్యతను పవర్లూమ్ నేతన్నలకు అప్పగించడంతో వారికి ఏడాది పొడవునా ఉపాధి లభించి జీవనప్రమాణాలు మెరుగయ్యాయి. ఏటా 95 లక్షల నుంచి కోటి బతుకమ్మ చీరలను తయారు చేయిస్తున్న ప్రభుత్వం.. ఈ ఏడాది కోటి చీరలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. ఇందుకోసం రూ.338 కోట్లు కేటాయించింది. ఈ చీరల తయారీ దాదాపు పూర్తికావడంతో వచ్చే నెల 10లోగా ప్యాకింగ్ పూర్తిచేసి జిల్లాలకు రవాణా చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. సెప్టెంబర్ 25న బతుకమ్మ పండుగ నాటికి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు.