హైదరాబాద్/సంగారెడ్డి, జూన్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 12 జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ప్రభుత్వ దవాఖానల్లో సిద్ధమైన రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలు (డయాగ్నస్టిక్ సెంటర్లు) బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ఒక్కో సెంటర్లో విలువైన 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మహబూబ్నగర్, సంగారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, ఖమ్మం, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ కేంద్రాల ద్వారా రక్త, మల, మూత్ర పరీక్షలతోపాటు వీటికి అనుబంధంగా ఉండే సుమారు 100 రకాల పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. కాలేయం, మూత్రపిండాలు, థైరాయిడ్, రక్తంలో కొలెస్ట్రాల్, షుగర్, కీళ్ల వాతం తదితర పరీక్షలూ చేస్తారు. ఇందుకు అత్యాధునిక వైద్య పరికరాలతో ప్రయోగశాలలు ఏర్పాటుచేశారు. పరీక్షల తీరును అనుసరించి ఒక్కో యంత్రం రోజుకు 400 నుంచి 800 రిపోర్టులను అత్యంత కచ్చితత్వంతో అందజేస్తుందని వైద్యాధికారులు తెలిపారు. నమూనాలు సేకరించే సమయంలో పూర్తిస్థాయిలో ఆన్లైన్ విధానాన్ని అనుసరిస్తారు. ఫోన్ నంబర్ ఆధారంగా ఫలితాలను తెలుసుకోవడం సాధ్యం కానున్నది. ఈ డయాగ్నసిక్ సెంటర్లలో ఉచితంగా పరీక్షలు అందుబాటులోకి రావడం వల్ల వైద్య ఖర్చులు తగ్గనున్నాయి. పరీక్షా కేంద్రానికి వెళ్లలేని వారి నుంచి పీహెచ్సీలోనే నమూనాలను సేకరించి ఆయా కేంద్రాలకు పంపిస్తారు. ఫలితాలు రాగానే పీహెచ్సీల్లోనే చికిత్స అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ల ద్వారా ప్రజారోగ్యం మరింత మెరుగుపడనున్నదని వైద్యవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
పేదలకు మెరుగైన వైద్యసేవలే లక్ష్యం
పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి ఎన్ని నిధులైనా ఖర్చుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్రావు పేర్కొన్నారు. ఖరీదైన రోగనిర్ధారణ పరీక్షలను బాధితులకు ఉచితంగా అందజేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల్లో డయాగ్నస్టిక్ హబ్లు ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. బుధవారం సంగారెడ్డిలో జిల్లా కేంద్ర దవాఖాన ప్రాంగణంలో రూ.2.50 కోట్లతో ఏర్పాటుచేసిన తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ (టీ-హబ్), రూ.1.60 కోట్లతో ఏర్పాటుచేసిన ఆర్టీపీసీఆర్ సెంటర్ను మంత్రి హరీశ్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. త్వరలో మరిన్ని జిల్లాల్లో డయాగ్నస్టిక్ హబ్లు ప్రారంభించనున్నట్టు తెలిపారు. డయాగ్నస్టిక్ సెంటర్లో త్వరలో రేడియాలజీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు. కొవిడ్ నుంచి కోలుకున్నాక పలు డయాగ్నస్టిక్ పరీక్షల కోసం రోగులపై రూ.10 వేలకుపైగా ఆర్థికభారం పడుతున్నదని చెప్పారు. అప్పుడు నిర్వహించే డీ డైమర్, ఫెర్రిటన్, సీఆర్పీ (సీ రియాక్టివ్ ప్రొటీన్ టెస్టు), ఎల్డీహెచ్ (ల్యాక్టేట్ డీహైడ్రోజనీస్ టెస్టుల)ను టీహబ్లో ఉచితంగా చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిపారు. రూ.2.50 కోట్లతో కొత్త సీటీస్కాన్ యంత్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలులో తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించినట్టు మంత్రి హరీశ్రావు తెలిపారు. 2020-21లో ఆంధప్రదేశ్, పంజాబ్ రాష్ర్టాలను మించి తెలంగాణలో 3 కోట్ల టన్నుల బియ్యం సేకరించినట్టు వెల్లడించారు. డయాగ్నస్టిక్ హబ్, ఆర్టీపీసీఆర్ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.