హైదరాబాద్, సెప్టెంబర్4 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ దినోత్సవం వేళ గురుకులాల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కారు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే బీసీ గురుకులాల్లోని 139 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేసిన ప్రభుత్వం, తాజాగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న 567 మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల పోస్టులను క్రమబద్ధీకరించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2007లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 567 మంది ఉపాధ్యాయులు కాంట్రాక్టు ప్రాతిపదికన నియమితులయ్యారు.
అందులో స్టాఫ్నర్సులతోపాటు లైబ్రేరియన్లు కూడా ఉన్నారు. వారితో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేయించిన నాటి ఉమ్మడి ప్రభుత్వం వేతనాలను మాత్రం ఇవ్వలేదు. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ మానవీయకోణంలో గురుకులాల్లో కాంట్రాక్టు ఉపాధ్యాయులకు రెగ్యులర్ ఉపాధ్యాయులతోపాటు పీఆర్సీని అమలు చేయడంతోపాటు.. 12 నెలల పూర్తి వేతనాన్ని చెల్లించేలా నిర్ణయం తీసుకొన్నారు. తాజాగా, సాంఘిక సంక్షేమ గురుకులాల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించారు. ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న 567 మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల్లో 504 మంది మహిళలే కావడం విశేషం. ప్రభుత్వం నిర్ణయంపై కాంట్రాక్టు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని ఆనందంగా చెప్తున్నారు.
మంత్రి కొప్పులకు కృతజ్ఞతలు
తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ను సచివాలయంలో సోమవారం ప్రత్యేకంగా కలిసి, కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించారని సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షురాలు శెట్టి రజని, ప్రధాన కార్యదర్శి సిరిమళ్ల జానకమ్మ, కోశాధికారి విక్టోరియా, స్వప్నారెడ్డి, సునీత, కిరణ్మయి, చంద్రశేఖర్ ప్రసూన, గాయత్రి ఉన్నారు. కాంట్రాక్టు ఉపాధ్యాయుల పోస్టులను రెగ్యులరైజ్ చేయడంపై ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చలపతి, జనరల్ సెక్రటరీ పీవీవీ వివేకానంద, స్టాఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, జనరల్ సెక్రటరీ ప్రభుదాస్, గౌరవ అధ్యక్షుడు ఏవీ రంగారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్బొజ్జాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఉద్యోగ భద్రత కల్పించిన ఘనత కేసీఆర్దే
దేశంలో ఎక్కడాలేని విధంగా గురుకులాలను ఏర్పాటు చేయడమే కాకుండా అందులో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందికి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సెలవులు మంజూరు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. ఇప్పుడు 567 మంది కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-బాలరాజు, రాష్ట్ర అధ్యక్షుడు (టీఎస్డబ్ల్యూఆర్టీఈఎస్)
జీవితాంతం రుణపడి ఉంటాం
మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని దశాబ్దాలుగా పోరాడాం. ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. కానీ సీఎం కేసీఆర్ మొదటినుంచీ కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమస్యలపై మానవీయకోణంలో స్పందిస్తున్నారు. అనేక సమస్యలను పరిష్కరించారు. రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా కాంట్రాక్టు టీచర్లకు వేతనాలు, సెలవులను మంజూరు చేశారు. ఇప్పుడు పూర్తిగా రెగ్యులరైజ్ చేయడం ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
-ప్రభుదాస్, ప్రధాన కార్యదర్శి (టీఎస్డబ్ల్యూఆర్ఈఐ స్టాఫ్ అసోసియేషన్)