హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ)/మియాపూర్: త్వరలో సంస్థలోకి 550 వరకు ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని టీఎస్ఆర్టీసీ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ చెప్పారు. సంస్థలో తొలిసారిగా 10 స్లీపర్ నాన్ ఏసీ బస్సులను బుధవారం హైదరాబాద్లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. బస్సుల లోపల సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం బాజిరెడ్డి, సజ్జనార్ మాట్లాడుతూ.. ఈ బస్సుల్లో ప్రయాణిస్తే అమ్మ ఒడిలాంటి అనుభూతి కలుగుతుందని, అందుకే వీటికి లహరి అని నామకరణం చేసినట్టు చెప్పారు. త్వరలో మరో 16 ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. బెంగళూరు హుబ్లీ, విజయవాడ, వైజాగ్ తదితర నగరాలకు ఏసీ స్లీపర్ బస్సులు నడుపుతామని చెప్పారు. బుధవారం ప్రారంభించిన నాన్ ఏసీ స్లీపర్ బస్సులు తొలుత హైదరాబాద్-కాకినాడ, హైదరాబాద్-విజయవాడ మార్గాల్లో అద్దె ప్రాతిపదికన నడుపుతారు. కాకినాడ వెళ్లే స్లీపర్ బస్సులు హైదరాబాద్ బీహెచ్ఈఎల్ నుంచి బయలుదేరతాయి. కార్యక్రమంలో ఆర్టీసీ సీవోవో డాక్టర్ రవీందర్, ఈడీలు వినోద్కుమార్, యాదగిరి, పురుషోత్తం, మునిశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
స్లీపర్ బస్సుల్లో 15 లోయర్ బెర్తులు, 15 అప్పర్ బెర్తులు ఉంటాయి. ప్రతి బెర్త్ వద్ద వాటర్ బాటిల్తోపాటు మొబైల్ చార్జింగ్ పెట్టుకొనే సౌకర్యం ఉంటుంది. సీటర్ కమ్ స్లీపర్ బస్సుల్లో 15 అప్పర్ బెర్తులతోపాటు లోయర్ లెవెల్లో 33 సీట్ల సామర్థ్యం ఉం టుంది. ప్రతి బస్సుకు ఎయిర్ సస్పెన్షన్ సదుపాయం కల్పించారు. ప్రతి బస్సులో వైఫై ఉంటుంది. ప్రయాణికులకు ఉచిత వాటర్ బాటిల్, ఫ్రెషనర్లను అందించడంతోపాటు లగేజీ లోడింగ్ అన్ లోడింగ్కు అటెండెంట్లు సహకరిస్తారు. ప్రయాణికులకు సౌకర్యవంతంగా విశాలంగా బెర్తులు ఏర్పాటు చేశారు.