నాడు.. దినసరి కూలీల బిడ్డలు.. గుమాస్తాల పిల్లలు.. చిన్నా చితక ప్రైవేట్ ఉద్యోగుల ఇంటి పాపలు.. వైద్యవృత్తి, ఇంజినీరింగ్పై ఆసక్తి ఉన్నా ఆదరించి ప్రోత్సహించేవారు లేక ఆశలను మొగ్గలోనే తుంచుకొనేవారు. నేడు..తెలంగాణ సర్కారు దన్నుతో, సీఎం కేసీఆర్ నెలకొల్పిన గురుకులాలతో అలాంటి పేదింటి బిడ్డలు తమ కలల పంట పండించుకొంటున్నారు. జాతీయస్థాయిలో అన్నిరంగాల్లో సత్తాచాటుతున్నారు. ఒంటిపై ఆప్రాన్ తొడిగి.. చేతిలో స్టెత్ పట్టుకొని సమాజ నాడిని చూస్తున్నారు. వైద్య వృత్తిలో రాణిస్తున్నారు. డ్రాఫ్టర్ పట్టుకొని అందమైన నిర్మాణాలు, అద్భుతమైన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. ఇదీ సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం. గురుకులాల విజయ ప్రస్థానానికి చిహ్నం. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ఐఐటీ, మెడిసిన్ తదితర ఉన్నత విద్యాభ్యాసం అనేది పేద, మధ్యతరగతి విద్యార్థులకు నిన్నా మొన్నటి వరకు అందని ద్రాక్ష. అప్పు చేసి కోచింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి. లేదంటే ఆశయాన్ని వదులుకోవాల్సిన దుస్థితి. ఇప్పుడు అలాంటి పేదింటి బిడ్డల ఆశయాలకు రాష్ట్రంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీలు ఆయువు పోస్తున్నాయి. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన గురుకులాలు వారి కలలను సాకారం చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 1,001 గురుకులాలను నెలకొల్పింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల సొసైటీల ఆధ్వర్యంలో 66 గురుకుల కళాశాలలను ‘సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ’గా (ప్రతిభా కళాశాలలు) తీర్చిదిద్దింది. మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసి ఐఐటీ, జేఈఈ, నీట్తోపాటు జాతీయ, రాష్ట్రస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నది. ఫలితంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల విద్యార్థులు ఉన్నత విద్యారంగంలోకి ప్రవేశివేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రాచుర్యం పొందిన ఉన్నత విద్యాసంస్థల్లో అడుగిడుతున్నారు.
ఉచితంగా ఇంటెన్సివ్ కోచింగ్
సీవోఈల్లో ప్రవేశం పొందిన ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఇంటర్మీడియట్ తరగతులతోపాటు ఐఐటీ, జేఈఈ, నీట్ కోసం వేర్వేరుగా ఇంటెన్సివ్ కోచింగ్ అందిస్తున్నారు. ఏటా నవంబర్ వరకు సిలబస్ను పూర్తి చేసి, మరోసారి రివిజన్ చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలు పూర్తికాగానే పోటీపరీక్షలకు సంబంధించిన శిక్షణను కొనసాగిస్తున్నారు. ఈ ఇంటెన్సివ్ కోచింగ్ ఫలితంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా గురుకుల విద్యార్థులు నీట్, జేఈఈ పరీక్షల్లో సత్తా చాటుతున్నారు. ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్తోపాటు, ప్రముఖ ఐఐటీలు, నిట్ క్యాంపస్లలో ప్రవేశాలు పొందుతున్నారు. ఇప్పటికే మొదటి బ్యాచ్ విద్యార్థులు మెడిసిన్, ఇంజినీరింగ్ పూర్తి చేసి సేవలు అందిస్తుండడం తెలంగాణ గురుకులాలకు గర్వకారణం. వీటితోపాటు ఇతర జాతీయస్థాయి పరీక్షల్లోనూ సత్తా చాటుతూ ప్రవేశాలు పొందుతున్నారు. నీట్, జేఈఈలో మంచి ర్యాంకులు సాధించి, అడ్మిషన్లు పొందిన ప్రతి విద్యార్థికీ తెలంగాణ సర్కారు ల్యాప్టాప్తోపాటు నగదు ప్రోత్సాహకాలు అందజేస్తున్నది. నిట్, ఐఐటీ, ఎంబీబీఎస్లో సీటు సాధించిన విద్యార్థులకు రూ. 50 వేలు, జీఐఎఫ్టీ సాధించిన విద్యార్థులకు రూ.40 వేలు అందిస్తూ ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు తెలంగాణ సర్కారు బాసటగా నిలుస్తున్నది.
విపరీతమైన పోటీ..
సోషల్వెల్ఫేర్ ఆధ్వర్యంలో 38, ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో 24, బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో 4 సీవోఈలు ఉన్నాయి. వీటిలో ప్రవేశాలకు ఏటికేడు విపరీతమైన పోటీ పెరుగుతున్నది. ఇప్పటికే సోషల్ వెల్ఫేర్ సొసైటీ సీవోఈ ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. 3,650 సీట్లకుగాను దాదాపు 80 వేలకుపైగా దరఖాస్తులు రావడం వీటికి లభిస్తున్న ఆదరణకు నిదర్శనంగా నిలుస్తున్నది. ప్రస్తుతం ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలోని సీవోఈల్లో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు, ఈ నెల 20తో ఆ గడువు ముగియనుంది. ఇక బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలోని సీవోఈలకు మహాత్మా జ్యోతిబాఫూలే గురుకులాల్లో చదివే విద్యార్థులను 8వ తరగతిలోనే ఎంపిక చేస్తున్నారు. పదో తరగతి పూర్తయ్యాక మరోసారి మెరిట్ టెస్ట్ నిర్వహించి ఇంటెన్సివ్ కోచింగ్ అందిస్తున్నారు.
పైసా ఖర్చు లేకుండా మెడిసిన్ సీటు
మాది నిజామాబాద్ జిల్లా భీంగల్. నేను రెండో తరగతిలో ఉన్నప్పుడే నాన్న చనిపోయారు. అమ్మ బీడీలు చుడుతూ నన్ను చదివించింది. 8వ తరగతి వరకు సుద్దపల్లి సోషల్ వెల్ఫేర్ గురుకులంలో చదివాను. 9, 10వ తరగతులు అల్గునూర్ సీవోఈలో పూర్తి చేశాను. అనంతరం గౌలిదొడ్డి సీవోఈకి ఎంపికయ్యా. అందులోనే నీట్ కోచింగ్ ఇచ్చారు. పైసా ఖర్చు లేకుండా మెడిసిన్ సీటు సాధించా. ప్రస్తుతం ఉస్మానియా కాలేజీలో మెడిసిన్ చేస్తున్న. తెలంగాణ ప్రభుత్వమే లేకుంటే నాకు మెడిసిన్ సీటు వచ్చి ఉండేది కాదు. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటా.
– నితీషా, ఉస్మానియా మెడికల్ కళాశాల విద్యార్థిని (గౌలిదొడ్డి కాలేజీ)
గురుకులంలో కోచింగ్తో ఎయిమ్స్లో సీటు
మాది మంచిర్యాల జిల్లా మందమర్రి. 6 నుంచి 10వ తరగతి వరకు టీఎస్ మాడల్ స్కూల్లో చదువుకున్న. ఇంటర్ సర్వేల్ టీఎస్ఆర్జేసీలో పూర్తి చేశా. గౌలిదొడ్డి సీవోఈలో నీట్ కోచింగ్ తీసుకొన్నా. ఎయిమ్స్లో సీటు వచ్చింది. డాక్టర్ కావాలన్న నా జీవితాశయాన్ని గౌలిదొడ్డి కళాశాల నెరవేర్చింది. సీఎం కేసీఆర్కు నా ప్రత్యేక కృతజ్ఞతలు.
– అభిలాష్, ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
గురుకులంలో చేరడమే గొప్ప మలుపు
మాది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్. నేను 7 నుంచి 10వ తరగతి వరకు ములుగు సోషల్ వెల్ఫేర్ గురుకులంలో చదివాను. ములుగు సీవోఈలోనే ఇంటర్ ఎంపీసీ పూర్తి చేశా. గౌలిదొడ్డి కాలేజీలో జేఈఈ కోచింగ్ తీసుకొన్నా. నా జీవితంలో అదొక గొప్ప మలుపు. కార్పొరేట్స్థాయి శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం వరంగల్ నిట్లో సీఎస్ఈ మొదటి సంవత్సరం చదువుతున్నా. తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.
– ప్రియాంక, నిట్ (వరంగల్)
స్వరాష్ట్రంలో విద్యా విప్లవం
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో నూతన విద్యా విప్లవం వెల్లివిరుస్తున్నది. గురుకులాలు అద్భుత విజయాలు, అనితర సాధ్యమైన ప్రతిభాపాటవాలకు చిరునామాగా నిలుస్తున్నాయి. నిరుపేద విద్యార్థులకు పైసా ఖర్చు లేకుండా ఐఐటీ, నీట్ లాంగ్టర్మ్ కోచింగ్ అందిస్తున్నాం. సీఎం కేసీఆర్ మార్గదర్శనం, వినూత్న నిర్ణయాల వల్లే ఈ ఫలితాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రికి నా ప్రత్యేక ధన్యవాదాలు.
–కొప్పుల ఈశ్వర్, సంక్షేమ శాఖ మంత్రి