హైదరాబాద్, మార్చి 7 : పేద ప్రజలకు పక్కా ఇండ్లు కట్టించడంలో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక సర్వే 2022 తెలిపింది. ఇండ్ల నిర్మాణంలో కేంద్రంపై తక్కువ ఆధారపడుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నదని పేర్కొన్నది. 2015లో ప్రారంభించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం కింద 2021 నవంబర్ వరకు రూ.10,455 కోట్లతో 1,07,612 ఇండ్లు నిర్మించినట్టు వెల్లడించింది. గడిచిన ఒక్క ఏడాదిలోనే 53 వేల ఇండ్లు నిర్మించినట్టు వివరించింది. 2018-19 సంవత్సరానికి ఈ పథకం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఎక్సలెంట్ పెర్ఫామెన్స్ ఇన్ ఈ-గవర్నెన్స్ అవార్డు సొంతం చేసుకొన్నదని గుర్తుచేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 50 శాతం ఇండ్లు ఎస్సీ, ఎస్టీలకు, 7 శాతం మైనారిటీలకు, 43 శాతం ఇతర వర్గాలకు, పట్టణాల్లో 17 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు, 12 శాతం మైనారిటీలకు , 65 శాతం ఇతర వర్గాలకు కేటాయిస్తున్నట్టు తెలిపింది.