హైదరాబాద్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో 5 గంటలకు పైగా కేబినెట్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 21వ తేదీన తలపెట్టిన శాసనసభ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 21వ తేదీన పెళ్లిళ్లు, శుభకార్యాలకు చివరి ముహూర్తం కావడం వల్ల పెద్దఎత్తున వివాహాది శుభకార్యక్రమాలు ఉన్నందున ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక సమావేశాలను రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.