హైదరాబాద్, మే 20 ( నమస్తే తెలంగాణ ) : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో 5 వేల క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కోసం స్థలాల సేకరణ చేపట్టాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించాలని, క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా ప్రతి పట్టణంలోని డివిజన్, వార్డులో కనీసం ఒక క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు ఎకరం స్థలం ఉండేలా చూడాలని పేర్కొన్నది. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, డివిజన్, వార్డులో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇటీవల నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తు తరాలు శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు తోడ్పడే విధంగా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 142 మున్సిపా లిటీలు, కార్పొరేషన్లలో 3,618 వార్డులు, డివిజన్లు ఉన్నాయి. జీహెచ్ఎంసీలో ఒక్కో డివిజన్కు మూడు, ఇతర కార్పొరేషన్ పరిధిలోని డివిజన్కు రెండు, చిన్న మున్సిపాలిటీలల్లో వార్డుకు ఒకటి చొప్పున క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తారు.