హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ-వేస్ట్).. ప్రస్తుతం ప్రపంచం ముందున్న పెద్ద సవాళ్లలో ఇదొకటి. సాంకేతిక పరిజ్ఞానం దినదినాభివృద్ధి చెందుతుండటంతో నిత్యం భారీ ఎత్తున ఈ-వేస్ట్ పేరుకు పోతున్నది. వీటిని అలాగే వదిలిస్తే పర్యావరణానికి ఊహించని ముప్పు తప్పదు. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు ప్రపంచ దేశాలన్నీ ఈ-వేస్ట్ నిర్వహణపై దృష్టి సారించాయి. దీంతో ఆసియాలోనే అతిపెద్దదైన ఈ-వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్ హైదరాబాద్లో ఏర్పాటవుతున్నది. రాంకీ అనుబంధ సంస్థ ఆర్ఈ సస్టెయినబులిటీ, అమెరికాకు చెందిన రెల్డాన్ కంపెనీ కలిసి దుండిగల్లో ఈ ప్లాంట్ను నెలకొల్పుతున్నాయి.
ఏడాదికి 20 వేల టన్నుల ఈ-వేస్ట్ను రీసైకిల్ చేయగలిగే ఈ ప్లాంట్ను రూ.500 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో ఇప్పటికే రూ.100 కోట్ల పెట్టుబడులతో చేపట్టిన మొదటి దశ పనులు తుది దశకు చేరుకున్నాయి. జూన్ మొదటి వారంలో తొలి యూనిట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది. దీనిలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో రీసైకిల్ చేయడంతోపాటు అత్యంత కీలకమైన భార లోహాలను తిరిగి వినియోగించుకునేందుకు వీలయ్యేలా చేయనున్నారు. ఈ-వేస్ట్ నిర్వహణ కోసం భారత్ ఇప్పటివరకు జర్మనీ, బెల్జియం లాంటి దేశాలపై ఆధారపడుతున్నది. దుండిగల్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై తదితర నగరాల నుంచి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తీసుకొచ్చి దుండిగల్ ప్లాంట్లో రీసైక్లింగ్ చేయనున్నారు. ఈ వ్యర్థాల సేకరణ కోసం ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థలతో ప్లాంట్ నిర్వాహకులు ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలతోపాటు ఫార్మాస్యూటికల్, పెట్రోకెమికల్, ఆభరణాల తయారీ పరిశ్రమల నుంచి కూడా వ్యర్థాలను సేకరించనున్నట్టు ప్లాంట్ నిర్వాహకులు తెలిపారు.
ఏటా 50 మిలియన్ టన్నుల ఈ-వేస్ట్
2019లో ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ టన్నుల ఈ-వేస్ట్ పేరుకుపోయినట్టు అంచనా. భారత్లో ఏటా 3.2 మిలియన్ టన్నుల ఈ-వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ-వేస్ట్ ఉత్పత్తిలో హైదరాబాద్ మూడో స్థానంలో ఉన్నది. ప్రస్తుతం మన దేశంలో ఈ-వ్యర్థాల నిర్వహణ 80% మేరకు అనధికారికంగానే కొనసాగుతున్నది. ఈ-వేస్ట్లో ప్రధానంగా ఉండే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు (పీసీబీ)ల్లో బంగారం, పల్లాడియం, నికెల్, సీసం వంటి లోహాలతోపాటు విషపూరిత రసాయనాలు కూడా ఉంటాయి. వీటిలో 6 నుంచి 10% వ్యర్థాల ప్రాసెసింగ్ మాత్రమే శాస్త్రీయ పద్ధతిలో జరుగుతున్నట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ఓ నివేదికలో పేర్కొన్నది. దేశంలో 3 వేలకుపైగా అనధికారిక ఈ-వేస్ట్ నిర్వహణ కేంద్రాలు ఉన్నట్టు నీతి ఆయోగ్ వెల్లడించింది.