హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 50 మంది టీచర్లు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ పురస్కారాలకు మొత్తం 81 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకొన్నారు. అందులో 40 మంది ఉపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖ పరిధిలోని రాష్ట్ర సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వీరితోపాటు ప్రభుత్వం స్పెషల్ క్యాటగిరీ కింద మరో 10 మంది ఉపాధ్యాయులను పురస్కారాలకు అర్హులుగా గుర్తించింది.
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ నెల 5న 50 మంది ఉపాధ్యాయులను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సత్కరించనున్నారు. ఇందులో 10 మంది ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, 19 మంది స్కూల్ అసిస్టెంట్లు, పీజీటీలు, 10 మంది ఎస్జీటీలు, టీజీటీలు, ఐఏఎస్ఈ(ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్) ఒకరు, అన్ని విభాగాల నుంచి మరో 10 మంది టీచర్లు ఉన్నారు. యూనివర్సిటీలు, డిగ్రీ, జూనియర్ కాలేజీలు తదితర విద్యాసంస్థల్లో మరికొంతమందిని పురస్కారాలకు ఎంపిక చేయనున్నారు.