హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు బిల్డర్లు కడితే రూ.50-60 లక్షల ధర పలికే ఫ్లాట్లను డబుల్ బెడ్రూం ఇండ్ల రూపంలో పేదలకు రాష్ట్రప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నదని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ఇండ్ల నిర్మాణంలో నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.మలక్పేట నియోజకవర్గం ఛావ్నీ డివిజన్లో రూ.29.41 కోట్లతో నిర్మించిన 288 పిల్లిగుడిసెల డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ శనివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, ఎమ్మెల్యే అహ్మద్ బలాలాతో కలిసి లబ్ధిదారులకు ఇండ్లపట్టాలు అందజేశారు. ఈ డబుల్బెడ్రూం ఇండ్ల సముదాయంలో షిండ్లేర్ కంపెనీ లిఫ్టు వాడామని, సీఎం కేసీఆర్ నివాసం ఉండే ప్రగతిభవన్లో కూడా ఇదే లిఫ్టు వాడుతున్నారని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నాణ్యతలో ప్రభుత్వం రాజీపడటం లేదనేందుకు ఇదే నిదర్శనమన్నారు. నిరుపేదల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచేలా రూ.18వేల కోట్లతో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్లో రూ.9,700 కోట్లతో లక్ష ఇండ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ జరగ్గా.. 70 వేల ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. కరోనా కారణంగా ఆలస్యమైందని, వాటిని త్వరలో ప్రజలకు అందిస్తామని తెలిపారు.
ఏడాదిలో మరో మూడు సూపర్స్పెషాలిటీ ఆస్పత్రులు…
ప్రభుత్వం వద్ద ఉన్న వివరాల ప్రకారమే డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులను ఎంపికచేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. దళారులు, పైరవీకారుల మాటలు నమ్మి డబ్బులు ఇవ్వొద్దని సూచించారు. హైదరాబాద్లో నాలుగు దిక్కుల్లో ఒక్కో మల్టీ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం చేపట్టామని చెప్పారు. గచ్చిబౌలిలో ఇప్పటికే టిమ్స్ను ప్రారంభించగా, ఆల్వాల్, గడ్డిఅన్నారం, చెస్ట్ దవాఖానలను ఏడాదిలోగా ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం వెనుకడుగు వేయదని స్పష్టచేశారు. ఆసరా పెన్షన్లు గతంలో రూ.200 ఉంటే ఇప్పుడు రూ.2,106, వికలాంగులకు రూ.500 ఉంటే రూ.3,016 పెంచిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. గతంలో ఐదు కిలోల చొప్పున కుటుంబం మొత్తం గరిష్ఠంగా 20 కిలోల బియ్యం రేషన్ షాపు ద్వారా ఇచ్చే నిబంధన ఉంటే, ఇప్పుడు కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ బడిలో చదువుకొంటున్న పేద విద్యార్థులకు సన్న బ్యియం అందిస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాలోని పేద విద్యార్థులు చదువుకొనేందుకు దాదాపు 1,000 గురుకుల పాఠశాలలను ప్రారంభించి, ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.25 లక్షలు ఖర్చుచేస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు బూట్లు, పుస్తకాలు, దుప్పట్లు, బట్టలు, భోజనం ఉచితంగా ఇవ్వటంతోపాటు నాణ్యమైన విద్య అందిస్తున్నామని వివరించారు.
పేదలకు సర్కార్ తోడ్పాటు
మాలాంటి పేదల కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎంతగానో ఆలోచిస్తున్నది. పేదల బ్రతుకు మార్చేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారు. లక్షలు విలువచేసే డబుల్ బెడ్రూంలను ఉచితంగా అందజేస్తున్నారు. ఇంతకంటే ఇంకేం కావాలి? పేదలను అన్ని విధాలుగా సీఎం కేసీఆర్
ఆదుకొంటున్నారు.
-సఫియా సుల్తానా, డబుల్ బెడ్రూం లబ్ధిదారు