Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణవ్యాప్తంగా ఈ ఏడాది 5 శాతం అధిక వర్షపాతం నమోదైనా తీవ్రమైన నీటిఎద్దడి ఎదురవుతున్నది. భూగర్భ జలాలు దారుణ స్థాయికి పడిపోతున్నాయి. భూగర్భ జలశాఖ తాజాగా వెల్లడించిన నివేదిక ఆ విషయాన్ని స్పష్టం చేసింది. దాని ప్రకారం ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో 5 శాతం అధిక వర్షపాతం ఉన్నా, గత ఏడాదితో పోల్చితే రాష్ట్రంలోని 32 జిల్లాల్లో భూగర్భజల మట్టం సగటున 1.67 మీటర్లు పడిపోయింది.
2023-24 నీటి సంవత్సరంలో మార్చి31 వరకు రాష్ట్ర సాధారణ వర్షపాతం 876 మిల్లీమీటర్లు కాగా, రాష్ట్రంలో 926 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే.. సాధారణం ఉన్నా 5 శాతం ఎక్కువే. కానీ, 2014-2023తో పోల్చితే ఈ ఏడాది పరిస్థితి దారుణంగా ఉన్నదని నివేదిక వెల్లడించింది. 612 మండలాల్లో 201 మండలాల్లో సగటున 0.01 మీటర్ల నుంచి 15.25 మీటర్ల వరకు భూగర్భజల మట్టం పడిపోయిందని తెలిపింది. మిగిలిన 411 మండలాల్లోనూ పరిస్థితి ఆశాజనకంగా లేదని వివరించింది.
రాష్ట్రంలో అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలో భూగర్భ జలమట్టం పడిపోయిందని నివేదిక తెలిపింది. అక్కడ సగటున 0.39 మీటర్లు -4.01 మీటర్లుగా నమోదయిందని తెలిపింది. 51 రెవెన్యూ మండలాల్లో 0.5 మీటర్లు, 38 మండలాల్లో 0.5-1.0 మీటర్లు, 45 రెవెన్యూ మండలాల్లో 1-2 మీటర్లు, 67 మండలాల్లో 2 మీటర్ల కంటే ఎకువ లోతు భూగర్భ జలాలు పడిపోయినట్టు వివరించింది. జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని భూగర్భ జలమట్టాన్ని విశ్లేషించగా దాదాపు 26 జిల్లాల్లో సగటున 0.02-3.59 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పడిపోయింది. అత్యల్పంగా సంగారెడ్డిలో నమోదయింది.
రాష్ట్రంలో మొత్తం వైశాల్యంలో దాదాపు 33 శాతం మేర ఈ ప్రభావం ఉండగా, నిజామాబాద్ మధ్య, దక్షిణ భాగాలు, నిర్మల్ తూర్పు, ఆదిలాబాద్, జగిత్యాల, ములుగు, మెదక్, మేడ్చల్, హైదరాబాద్ కేంద్ర భాగాలు, నల్లగొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల, వికారాబాద్ సెంట్రల్, ఆగ్నేయ, భద్రాద్రి కొత్తగూడెం ఉత్తర, కామారెడ్డి పశ్చిమ, నారాయణపేట ఈశాన్య ప్రాంతాల్లో గరిష్ఠంగా భూగర్భజల మట్టాలు పడిపోయాయి. 411 మండలాల్లో అతిస్వల్పంగా భూగర్భ జలమట్టం పెరిగింది. 48 మండలాల్లో 0.5 మీటర్లు, 65 మండలాల్లో 0.5-1.0 మీటర్లు, 122 మండలాల్లో 1-2 మీటర్లు, 176 మండలాల్లో 2 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి.
ఆదిలాబాద్ సెంట్రల్, నిర్మల్ నైరుతి, కుమ్రంభీం ఆసిఫాబాద్ వాయవ్య, కామారెడ్డి పశ్చిమ, నిజామాబాద్ తూర్పు భాగాలు, సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, జనగామ, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, ఖమ్మం, సూర్యాపేటలోని కొన్ని ప్రాంతాల్లో అతితక్కువగా జలాలు పెరిగాయని నివేదిక తెలిపింది. చాలా మంది విచక్షణారహితంగా బోర్లు వేస్తున్నారని, పట్టణప్రాంతాల్లో 1000 ఫీట్ల కంటే ఎక్కువ లోతుకు బోర్లు వేస్తున్నందున భూగర్భ జలాలపై ప్రభావం పడుతున్నదని భూగర్భజల శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. రాష్ట్రంలో అతి తక్కువ భూగర్జ జలాల రీచార్జ్ స్థాయిని కలిగి ఉన్న ప్రాంతం మహబూబ్నగర్ అని నివేదిక పేర్కొన్నది.