హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రోడ్డు ప్రమాదంలో మరణించిన టీఆర్ఎస్ కార్యకర్త కుసుమ రాజు కుటుంబానికి ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి అండగా నిలిచారు. హైదరాబాద్లోని రాష్ట్ర రైతుబంధు సమితి కార్యాలయంలో శుక్రవారం ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన రాజు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏటూరునాగారంలో నిర్వహించిన వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల సన్నాహక సమావేశానికి హాజరై తిరిగి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకొంటానని అప్పట్లోనే హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి.. రాజు ఇద్దరు పిల్లలకు రూ.2.50 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్లు చేయించి, ఆ బాండ్పేపర్లను రాజు కుటుంబసభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో కుసుమ రాజు కుటుంబసభ్యులు కుసుమ లక్ష్మి, కుసుమ స్వాతి, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, టీఆర్ఎస్ ఏటునాగారం మండల పార్టీ అధ్యక్షుడు గడదాసు సునీల్కుమార్, నాయకులు తుమ్మ మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ తుమ్మ సంజీవరెడ్డి, పీఏసీ చైర్మన్ కూనూర్ అశోక్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.