సూర్యాపేట : తెలంగాణలో రెండో అతిపెద్దదైన పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం జీఓ జారీ అయింది. యాదవుల ఆరాధ్య దైవమైన లింగమంతులస్వామి జాతర ఫిబ్రవరి 5 నుంచి ఐదు రోజుల పాటు కొనసాగనుంది. సమ్మక్క, సారలమ్మ జాతర తరువాత ఆ స్థాయిలో జనం వచ్చే రెండో అతి పెద్ద జాతరగా లింగమంతుల స్వామి తిరునాళ్లకు గుర్తింపు ఉంది.
ఈ జాతరను సమైక్య రాష్ట్రంలో కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. స్వరాష్ట్రంలో దీనికి నిధుల వరద కొనసాగుతుండగా.. పెద్దగట్టు రూపురేఖలే మారిపోయాయి. రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2015 ఫిబ్రవరిలో జరిగిన మొదటి జాతరకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించారు. ఇందుకోసం జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఒప్పించి సీఎం స్పెషల్ డెవల్మెంట్ ఫండ్ నుంచి రూ.2.10 కోట్లు తీసుకొచ్చారు.
రెండేండ్ల తరువాత 2017లో జాతరను మరింత వైభవోపేతంగా నిర్వహించేందుకు రూ.1.29 కోట్లు, 2019లో రూ.1.75 కోట్లు, 2021లో రూ.2 కోట్లు ఖర్చు చేశారు. తాజాగా వచ్చే నెలలో జరుగనున్న జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం మరో రూ.5 కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులతో ప్రణాళికాబద్ధంగా సకల సౌకర్యాలు కల్పిస్తామని లింగమంతుల స్వామి ఆలయ పాలకవర్గ చైర్మన్ కోడి సైదులు యాదవ్ తెలిపారు. జాతరకు రూ.5 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు, అందుకు కృషి చేసిన మంత్రి జగదీశ్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.