శ్రీరాంపూర్, సెప్టెంబర్ 27 : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో పెద్ద ఎత్తున గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్ర మీదుగా మంచిర్యాల జిల్లాకు అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని శ్రీరాంపూర్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామగుండం సీపీ రెమా రాజేశ్వరి ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా చిత్రాపరి గ్రామానికి చెందిన డ్రైవర్ జగబంధు క్రిసాని(22), చిత్రాసేన్ క్రిసాని(23) ట్రాక్టర్లో ఈ నెల 23న గంజాయిని తీసుకొస్తున్నారు.
శ్రీరాంపూర్లో జాతీయ రహదారిపై ట్రాక్టర్ టైర్ పంక్చర్ అయ్యింది. దీంతో నిందితులు ట్రాక్టర్ను వదిలి పారిపోయారు. పెట్రోలింగ్ పోలీసులు ట్రాక్టర్ను శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆతర్వాత ట్రాక్టర్ లో తనిఖీ చేయగా, సిమెంట్ ఇటుకల కింద 93 గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. 465 కిలోల గంజాయిగా గుర్తించి, దీని విలువ సుమారు రూ.93 లక్షల వరకు ఉంటుందని నిర్ధారించారు. ట్రాక్టర్లో దొరికిన పత్రాల ఆధారంగా నిందితులను గుర్తించారు.
వెంటనే ఒడిశాకు వెళ్లిన ఒక బృందం ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ట్రాక్టర్ యజమాని చిత్రసేన్ క్రిసాని, అతడి సోదరుడు జగబంధును అరెస్ట్ చేశారు. ఈశ్వర్, గురు క్రిసాని కోసం గాలిస్తున్నారు. గంజాయి, ట్రాక్టర్, 2 సెల్ ఫోన్లు, నిందితుల అరెస్ట్ను రామగుండం సీపీ రెమా రాజేశ్వరి చూపించారు. డీసీపీ సుధీర్ రామ్నాధ్ కేకేన్, జైపూర్ ఏసీపీ మోహన్ ఉన్నారు.