Monsoon | హైదరాబాద్ : వానాకాలం జోరందుకోనుంది. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో రాష్ట్రంలో వర్షపాతం ఆశించిన స్థాయిలో లేదు. నైరుతి రుతుపవనాల సీజన్ జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు పరిగణిస్తారు. అయితే జూన్ నెలలో మూడు వారాల తర్వాత రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో వానలు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వానలు జోరందుకున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెలలో సాధారణ వర్షపాతం 24.44 సెం.మీ. మేర నమోదు కావాల్సి ఉంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల కదలికలు చురుకుగా ఉండటంతో ఈ నెలలో సాధారణంకంటే ఎక్కువగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. జూలై నెలకు సంబంధించి దేశవ్యాప్తంగా వర్షపాతం నమోదు అంచనాలను వాతావరణ శాఖ విడుదల చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో సాధారణం కంటే 10 శాతం అధికంగా వర్షాలు కురుస్తాయని వివరించింది.
ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావారణ శాఖ సూచించింది. ఈనెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
జూన్ 22న రాష్ట్రంలోకి వచ్చిన నైరుతి వచ్చిన రుతుపవనాలతో చాలా చోట్ల మోస్తరు వానలే కురిశాయి. జూన్లో 12.93 సెం.మీ సగటు వర్షం కురవాల్సి ఉండగా, నెలాఖరు నాటికి 7.27 సెం.మీ మాత్రమే నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 46 శాతం లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 7 జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది.
సంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్కర్నూల్, నల్లగొండ, నారాయణపేట జిల్లాల్లో జూన్ నెల సాధారణ వర్షపాతం నమోదైంది. 18 జిల్లాల్లో లోటు వర్షపాతం, మరో 8 జిల్లాల్లో అత్యంతలోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. జూలైలో మాత్రం వర్షాలు ఆశించిన స్థాయిలో కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.