హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి రుతుపవనాల రాక ఆలస్యం కారణంగా జూన్లో లోటు వర్షపాతం నమోదైంది. కానీ, జూలైలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వానలు జోరందుకున్నట్టు ఆ కేంద్రం వెల్లడించింది. సోమవారం నుంచి నాలుగు రోజులపాటు పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. నైరుతి రుతుపవనాల సీజన్ను జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు పరిగణిస్తారు. జూన్లో మూడు వారాల తర్వాత రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో వానలు ఆలస్యమయ్యాయి.
జూలైలో సాధారణం కంటే 10% అధికం
ఈ నెలలో సాధారణ వర్షపాతం 24.44 సెంటీమీటర్ల మేర నమోదు కావాల్సి ఉన్నది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల కదలికలు చురుకుగా ఉండటంతో సాధారణంకంటే ఎక్కువగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణశాఖ స్పష్టంచేసింది. జూలై నెలకు సంబంధించి దేశవ్యాప్తంగా వర్షపాతం నమోదు అంచనాలను వాతావరణ శాఖ విడుదల చేసింది. సాధారణం కంటే 10 శాతం అధికంగా వర్షాలు కురుస్తాయని వివరించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం నుంచి నాలుగు రోజులపాటు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావారణశాఖ సూచించింది. వచ్చే నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురువచ్చని తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
జూన్లో 7.27 సెంటీమీటర్లు మాత్రమే
రాష్ట్రంలోకి ఆలస్యంగా జూన్ 22న నైరుతి రుతుపవనాలు రావడంతో చాలాచోట్ల మోస్తరు వానలే కురిశాయి. జూన్లో 12.93 సెంటీమీటర్ల సగటు వర్షం కురవాల్సి ఉండగా, నెలాఖరు నాటికి 7.27 సెంటీమీటర్లు మాత్రమే నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 46 శాతం లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఏడు జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం కురింది. సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్కర్నూల్, నల్లగొండ, నారాయణపేట జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 18 జిల్లాల్లో లోటు వర్షపాతం, మరో ఎనిమిది జిల్లాల్లో అత్యంతలోటు వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.