ఫర్టిలైజర్సిటీ, ఆగస్టు 31: మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ-2లో బంగారం, నగదు మాయం కేసు మిస్టరీ వీడింది. బ్యాంక్ క్యాషియర్ నరిగే రవీందరే ప్రధాన సూత్రధారి అని, మేనేజర్తోపాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కలిసి ఈ ఘరానా మోసానికి పాల్పడినట్టు తేలింది. ఆదివారం కమిషనరేట్ హెడ్క్వార్టర్స్లో సీపీ అంబర్ కిశోర్ ఝా మీడియాకు వివరాలు వెల్లడించారు. బ్యాంకులో 12.61 కోట్ల విలువైన 402 గోల్డ్లోన్ ఖాతాల ఆభరణాలు (25.17కిలోల బంగారం), నగదు 1.10కోట్లు గల్లంతైనట్టు గుర్తించిన బ్యాంకు రీజినల్ మేనేజర్ రితేశ్కుమార్ గుప్తా ఈ నెల 23న చెన్నూరు ఠాణాలో ఫిర్యాదు చేశారు.
జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ దర్యాప్తు చేపట్టారు. బ్యాంకు క్యాషియర్ రవీందర్ ఖాతాలో భారీగా డిపాజిట్లు ఉండడంతో ప్రధాన నిందితుడిగా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. రవీందర్ నిరుడు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లో 40లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు మళ్లీ బెట్టింగ్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. బ్యాంకు మేనేజర్ మనోహర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సందీప్తో కలిసి తాకట్టు బంగారం మాయం చేయాలని స్కెచ్ వేశాడు. నిరుడు అక్టోబర్లో గోల్డ్లోన్ చెస్ట్ట్ నుంచి బంగారం తీసి మంచిర్యాల ఎస్బీఎఫ్సీ సేల్స్ మేనేజర్ బీరేశ్, కస్టమర్ రిలేషన్ మేనేజర్ రాజశేఖర్, సేల్స్ ఆఫీసర్ బొల్లి కిషన్కు అప్పగించగా వీరు ఆ బంగారాన్ని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలలో తాకట్టు పెట్టి, వచ్చిన డబ్బులో కమీషన్ తీసుకొని మిగితా క్యాషియర్ రవీందర్కు బదిలీచేశారు.
ఎస్బీఎఫ్సీ, ఇండెల్మనీ, గోదావరి అర్బన్, మణిపురం, ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్లలో 44మంది పేర్లపై 142 గోల్డ్ లోన్లు తీసుకున్నారు. ఈ కేసులో క్యాషియర్ సహా 44 మందిని పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేసి, తాకట్టు పెట్టిన ఆభరణాలు 15.23 కిలోలు రికవరీ చేశారు. అరెస్టయినవారిలో జైపూర్ మండలం శెట్టిపల్లికి చెందిన క్యాషియర్ రవీందర్, బ్యాంకు మేనేజర్ మనోహర్, అవుట్సోర్సింగ్ అటెండర్ సందీప్, మంచిర్యాల ఎస్బీఎఫ్సీ గోల్డ్ లోన్ ఫైనాన్స్ సేల్స్ మేనేజర్ బీరేశ్, కస్టమర్ రిలేషన్ మేనేజర్ రాజశేఖర్, సేల్స్ ఆఫీసర్ కిషన్కుమార్, ఫొటోగ్రాఫర్ సురేశ్ సహా పలువురు ఉన్నారు.