విశాలాంధ్ర నినాదంతో కలిసుందామన్నారు. కలిశాక.. పెద్దమనుషుల ఒప్పందాలు చెల్లవంటూ కాంగ్రెస్ వినిపించిన ఆరోవేలు కథ విన్నప్పుడే ఆ పార్టీ ‘చేయి’చ్చిందనిఅర్థమైపోయింది. మన కొలువులు లాక్కున్నప్పుడే కాంగ్రెస్ కుట్ర తెలిసిపోయింది. మన నిధులు మళ్లించినప్పుడేకాంగ్రెస్ది బందిపోటు ప్రభుత్వమని నిర్ధారణ అయింది. మన నీళ్లు ఎత్తుకపోయినప్పుడే అది దొంగల పార్టీఅని తేలిపోయింది. వెరసి, కాంగ్రెస్ దమననీతి 1969 ఉద్యమానికి కారణమైంది.
Telangana Movement | ఆంధ్ర రాష్ర్టాన్ని తెలంగాణతో కలిపి 1956లో ఆంధ్రప్రదేశ్గా ఆవిర్భవింపజేసిన తీరు ఒక చారిత్రక తప్పిదం! పైగా విలీన సమయంలో చేసిన వాగ్దానాలను కాంగ్రెస్ విస్మరించడం 1969 ఉద్యమానికి నాంది పలికింది. కాసు బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి చేస్తున్న ద్రోహాన్ని ఎండగడుతూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోకి విద్యార్థులు అడుగుపెట్టారు. ఖమ్మం నుంచి మొదలైన పోరాటం.. తెలంగాణ అంతా విస్తరించింది. మనబిడ్డల పొలికేకకు బెదిరిన కాంగ్రెస్.. ఉద్యమకారులపై బందూకులతో తెగబడింది.
ఖమ్మం పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో బి.ఎ. చదువుతున్న అన్నాబత్తుల రవీంద్రనాథ్ 1969 జనవరి 8న ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. ఆ రోజు ఖమ్మం పట్టణంలో విద్యార్థులు పెద్ద ఊరేగింపు తీశారు. బొటనవేలుని బ్లేడ్తో కోసుకుని విద్యార్థులు రక్త తిలకాలు దిద్దుకున్నారు. దీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఊరేగింపులు జరిగాయి. ఉద్యమం ఊపందుకున్నది. ప్రత్యేక ఒప్పందాలు కాదు.. ప్రత్యేక రాష్ట్రమే కావాలని యావత్ తెలంగాణ దీక్షబూనింది. కొత్తగూడెంలో రాజుకుని ఖమ్మంలో ఉధృతమైన తెలంగాణ ఉద్యమం ఆంధ్రాపాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. వెనువెంటనే అన్ని పార్టీలు స్పందించాయి. ముఖ్యమంత్రి ఇంట్లో అఖిలపక్ష సమావేశం, పెద్ద మనుషుల ఒప్పందం అమలుకోసం ‘ఆల్ పార్టీ అగ్రిమెంట్’, జీవో నంబర్ 36 జారీ జరిగిపోయాయి.
జీవో నంబర్ 36కు పెద్ద మనుషుల ఒప్పందానికి పట్టిన గతే పడుతుందని విద్యార్థుల సందేహం. జనవరి 19న ఆమోదించిన జీవో నంబర్ 36 మీద పెట్టిన సంతకం ఆరకముందే, జనవరి 20న శంషాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఆందోళన చేస్తున్న పాఠశాల విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరిపారు. 12 నుంచి 16 ఏండ్ల మధ్య వయసున్న ఆరుగురు పిల్లలు ఈ కాల్పుల్లో గాయపడ్డారు. ఈ కాల్పులను నిరసిస్తూ తెలంగాణలోని అన్ని రైల్వే స్టేషన్లలో ఆందోళన చేపట్టారు. పలు రైళ్లు ధ్వంసమయ్యాయి.
హైదరాబాద్, నిజాం కళాశాలలోకి చొరబడిన పోలీసులు తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులను చావబాదారు. అడ్డుచెప్పిన కళాశాల సిబ్బందిని కూడా వదిలిపెట్టలేదు. ప్రతిఘటించిన విద్యార్థులపై పోలీసులు 26 సార్లు బాష్పవాయుగోళాలను ప్రయోగించారు.
అదే రోజు సైఫాబాద్ యూనివర్సిటీ, పాలిటెక్నిక్, సికింద్రాబాద్ యూనివర్సిటీ కాలేజీల విద్యార్థులపై లాఠీఛార్జ్ చేశారు.
ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు విద్యార్థి నేతలపై ఒత్తిడి తెచ్చారు. కానీ వారు వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు పొడిగించింది. ఆమరణ దీక్ష చేస్తున్న రవీంద్రనాథ్ తండ్రిపై ఒత్తిడి చేసి, జలగం వెంగళరావు దీక్ష విరమింపజేశాడు. ఇంతటితో విద్యార్థి ఉద్యమం చల్లారిపోతుందని కాంగ్రెస్ పెద్దలు కలలుగన్నారు. కానీ, తెలంగాణ పోరు పట్టణాల నుంచి గ్రామాలకూ విస్తరించింది.
కేటీపీఎస్లో అక్రమంగా ఉద్యోగాలు పొందిన స్థానికేతరులను తొలగించాలని 12 రోజులపాటు పోటు కృష్ణమూర్తి నిరశన కొనసాగించాడు. దీక్షకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న వారిపై జనవరి 21న పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆ తర్వాత కాల్పులు జరిపారు.
ప్రత్యేక తెలంగాణ కోరుతూ ధర్మపోరాటం చేస్తున్న విద్యార్థులపై జనవరి 21న పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో విద్యార్థులపై పోలీస్ ఇన్స్పెక్టర్ తుపాకీతో కాల్పులు జరిపాడు.
స్థానిక హైస్కూల్ విద్యార్థులు జనవరి 24న పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ను ఘెరావ్ చేశారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో విద్యార్థులుగాయపడ్డారు.వారిలో శంకర్, కృష్ణ.. గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ కాల్పులను నిరసిస్తూ ఖమ్మంలో విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. అప్పటి మంత్రి జలగం వెంగళరావు ద్రోహ పూరితంగా దీక్షలు విరమింపజేయటాన్ని నిరసించిన ఉద్యమకారులు మంత్రులకు గాజులు పంపారు.
తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కాసు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రజల ఆస్తులు, ప్రాణాలకు ముప్పు ఉందనే నెపంతో కనిపిస్తే కాల్చివేయాలని జనవరి 30న పోలీసులను ఆదేశించింది. అయినా వెరవకుండా వరంగల్లో విద్యారులు ర్యాలీ చేశారు. ప్రదర్శనను అడ్డగించిన పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. అయినా విద్యార్థులు తగ్గకపోవడంతో బందూకులతో తూటాలు పేల్చారు. పదుల సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారు.
బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాన్ని అక్రమంగా పొందిన ఓ అధికారి 24 గంటల్లోగా వెళ్లిపోవాలని యువకులు ధర్నా చేపట్టారు. నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరపగా నరసింహ అనే విద్యార్థి మరణించాడు. మరికొంతమంది గాయపడ్డారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్కు నిప్పుపెడుతుంటే కాల్పులు జరిపామని పోలీసులు వాదించారు.
ఆంధ్రులపై దాడులు చేస్తున్నారని పత్రికలు పుకార్లు పుట్టించాయి. తెలంగాణ వాళ్లపై.. మిగతా 13వ పేజీలో అంతా ఢిల్లీ కుట్రే హింసకు పాల్పడే వారి నుంచి ప్రజలను కాపాడేందుకే తెలంగాణ నాయకులను నిర్బంధించామని, ఢిల్లీ పెద్దల సూచనలతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నదని ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రకటించారు. ప్రజలు రోడ్డెక్కితే అడ్డగించే పోలీసులు ఈ గూండాలను మాత్రం అడ్డగించకుండా ఉన్నారు. దాడి చేసేందుకు ఆంధ్రాప్రాంతం నుంచి వస్తున్న ఆరు లారీలను కోదాడ సమీపంలోని నల్లబండ దగ్గర పోలీసులు నిలిపివేశారు. మరిన్ని లారీల్లో దుండగులు వస్తున్నట్టు తెలుసుకున్న స్థానికులు కోదాడలో గస్తీ కాశారు. వీరిపై పోలీసులు జనవరి 29న కాల్పులకు తెగబడగా ఇద్దరు మరణించారు. నలుగురు గాయపడ్డారు.
జనవరి 15 నుంచి మూతబడిన పాఠశాలలు ఫిబ్రవరి 17న తెరుచుకున్నాయి. బడులకు వచ్చిన విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఊరేగింపు తీశారు. పలుచోట్ల పోలీసులతో తలపడ్డారు. రైళ్లు, బస్సులపై రాళ్లు రువ్వారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. వీటిని అణచివేసేందుకు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, కోదాడ, నాగార్జునసాగర్ మొదలైన పట్టణాల్లో సైన్యాన్ని మోహరించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలను భయపెట్టేందుకు కవాతు చేయించారు. అలాంటి పరిస్థితుల్లో మార్చి 3న తెలంగాణ బంద్ విజయవంతంగా జరిగింది. ప్రత్యేక తెలంగాణ కోసమే ఉద్యమించాలని విద్యార్థులు, ఉద్యోగులు క్విట్ తెలంగాణ నినాదం అందుకున్నారు. తెలంగాణ సాధించేదాకా తరగతులను బహిష్కరించాలని ఉస్మానియా విద్యార్థులు తీర్మానించారు. ‘మేము విడిపోతాం’ అన్న నినాదాలు అసెంబ్లీలో మార్మోగాయి.
తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా 1969 ఏప్రిల్ 4న సికింద్రాబాద్, ఆర్పీ రోడ్లో కొందరు సమైక్యాంధ్ర సమావేశాన్ని తలపెట్టారు. దానిని నిరసిస్తూ వేలాదిమంది తెలంగాణవాదులు ప్రదర్శనగా రోడ్డెక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. నిరసనకారులను లాఠీలు విరిగేలా కొట్టారు. ఆపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇండ్లలోకి చొరబడి మరీ సాధారణ పౌరులనూ చితకబాదారు. బుల్లెట్ల వర్షం కురిపించారు. ఓ బిచ్చగాడి కాలులోకి తూటా దూసుకుపోగా, వైద్యులు కాలును తొలగించారు. ఈ కాల్పుల్లో ప్రకాశ్రావు, రాములు, మరొకరు చనిపోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. కాల్పులకు నిరసనగా తెలంగాణ బంద్ జరిగింది. బస్సులు తగులబెట్టారు. సికింద్రాబాద్ అమరులకు నివాళులర్పించేందుకు ఏప్రిల్ 7న నిజాం కళాశాల మైదానంలో సభకు తెలంగాణ నేతలు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ఈ సమావేశానికి భయపడి అన్ని జిల్లాల్లో తెలంగాణ ప్రజా సమితి నాయకులు, విద్యార్థి నాయకులు, తెలంగాణ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయాలని ఆదేశించారు.
జైళ్లలో ఉన్న నేతలు, విద్యార్థులను ఏప్రిల్ 28న విడుదల చేశారు. మే 1న ‘కోర్కెల దినం’ జరపాలని తెలంగాణ ఉద్యమకారులు నిర్ణయించారు. దీనిని భగ్నం చేసేందుకు పోలీసులు నేతలను ముందే అరెస్టు చేశారు. అయినా ప్రజలు పోలీసుల కళ్లుగప్పి చార్మినార్ ప్రాంతానికి చేరుకున్నారు. వారిని చెదరగొట్టడానికి బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అఫ్జల్గంజ్, చుడీ బజార్లో పోలీసులు కాల్పులు జరపగా ఆరుగురు గాయపడ్డారు. ప్రజలు పోలీసు స్టేషన్లు, జీపులు తగులబెట్టారు. పోలీసులు కాల్పులకు దిగడంతో ఇద్దరు మరణించారు. మే1న కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యమకారులను ఖైరతాబాద్ చౌరస్తాలో పోలీసులు అడ్డగించారు. ప్రజలు రైలు పట్టాలపై ఉండి పోలీసులపై రాళ్లు రువ్వారు. రాజ్భవన్ సాక్షిగా పోలీసులు కాల్పులు జరిపారు. విద్యార్థి నాయకుడు ఉమేందర్ రావు, మరో ముగ్గురు మరణించారు.
జూన్ 2న అణచివేత వ్యతిరేక దినం సందర్భంగా తెలంగాణ అంతటా ఆందోళన జరిగింది. దీనిని అడ్డుకునేందుకు ప్రభుత్వం గూండాలను ప్రయోగించింది. మరోవైపు పోలీసులు జరిపిన కాల్పుల్లో అయిదుగురు మరణించారు.
ప్రత్యేక తెలంగాణకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచించింది. ప్రజలు నిర్బంధాలను లెక్కచేయక ఉద్యమిస్తూనే ఉన్నారు. చేర్యాలలో ఏప్రిల్ 22న ‘జై తెలంగాణ’ అని నినాదాలు చేస్తూ వేలాది మంది బయలుదేరారు. పోలీస్ స్టేషన్ ఎదుట మంత్రుల దిష్టిబొమ్మలను తగులబెట్టారు. వారిపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. ప్రజలు పోలీస్ స్టేషన్పై రాళ్లు విసిరితే పోలీసు వాహనం తగులబెట్టారని, ప్రతిగా కాల్పులు జరిగినట్లు కొన్ని పత్రికలు చేర్యాల ఘటనపై కట్టుకథలు ప్రచురించాయి.
జూన్ 4న వేలాది మంది తెలంగాణ ఆందోళనకారులు రోడ్లెక్కారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు కాంగ్రెస్ దింపిన గూండాలు నిరసనకారులపై విరుచుకుపడ్డారు. పోలీసులూ గూండాలకే మద్దతిచ్చారు. పగలంతా సాగిన ఈ వీధి పోరాటం రాత్రి కర్ఫ్యూ ఉన్నా కొనసాగింది. ఈ ఘటనలో అనేక ఆస్తులు ధ్వంసమయ్యాయి. పాతబస్తీ నూర్ బజార్లో ఆందోళనకారులకు, పోలీసులకు ఘర్షణ జరిగింది. కాల్పులు మొదలయ్యాయి. ఆ సమయంలో వీధిలో ఆడుకుంటున్న బిడ్డను కాపాడబోయిన న్యాయవాది వెంకటేశ్వరరావు తలకు బుల్లెట్ తగిలింది. పోలీసు తూటాలు ఓ ఇంట్లో పాఠాలు చదువుకుంటున్న 16 ఏళ్ల బాలుడి ప్రాణాలు బలిగొన్నాయి. ఆ రోజు రాష్ట్రపతి రోడ్లో మూడుసార్లు కాల్పులు జరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, గాంధీ హాస్పిటల్, కాచిగూడ, బోయిగూడ, లాల్దర్వాజా, సుల్తాన్ బజార్, మలక్పేట, రైన్ బజార్లలో కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో ఎనిమిది మంది మరణించారని పోలీసులు ప్రకటించారు. 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని ఉద్యమకారులు పేర్కొన్నారు. నగరంలో 36 గంటల కర్ఫ్యూ ప్రకటించారు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. ఇరు ప్రాంతాల కాంగ్రెస్ నాయకులతో చర్చించారు.
ఇందిర వచ్చినా ఉద్యమంపై కాంగ్రెస్ వైఖరి మారలేదు. జూన్ 5న కూడా ప్రజా ఆందోళన కొనసాగింది. విద్యార్థులు పరీక్షలకు హాజరు కావద్దని నిర్ణయం తీసుకున్నారు. కర్ఫ్యూని ఉల్లంఘించారని వందల మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మూడుసార్లు నగరంలో కాల్పులు జరిగాయి. అరెస్టయిన వారిలో ఒకరు కస్టడీలో మరణించారు. ప్రభుత్వంఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు రాంనగర్, చాదర్ఘాట్లోని గుడిసెలను గూండాలతో తగులబెట్టించింది.
జూన్ 26న గౌలిగూడ (హైదరాబాద్), బాన్సువాడ, నిజామాబాద్లో జరిగిన కాల్పుల్లో ఒక్కొక్కరు మరణించారు. గౌలిగూడ కాల్పుల్లో సిటీ కాలేజీ విద్యార్థి మరణించాడు. మరో విద్యార్థి గాయపడ్డాడు. జూలై 7 తెలంగాణ బంద్ సందర్భంగా వరంగల్, పురానపూల్లోనూ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మరో ఇద్దరు చనిపోయారు. ఈ రక్తసిక్త పోరాటంలో లెక్కకు అందని మరణాలెన్నో. చరిత్రకెక్కని త్యాగాలెన్నో. ఆ చరితార్థుల త్యాగాల స్ఫూర్తితో మలిదశ తెలంగాణ ఉద్యమం చిగురించింది. ప్రత్యేక తెలంగాణను సాకారం చేసుకున్నది.
ఉద్యమానికి రక్తపు మరకలు అద్దిన ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణ అంతటా ఆందోళనలు వెల్లువెత్తాయి. నాగర్కర్నూల్ వెళ్తున్న సీఎంకు దారిపొడువునా నల్లజెండాలు, ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు విద్యార్థులు. జడ్చర్ల సమీపంలో జడపల్లి దగ్గర నిరసనలో పాల్గొన్న విద్యార్థులను ఓ పోలీసు అధికారి జుట్టుపట్టుకొని కొట్టాడు. విద్యార్థులు రాళ్లు రువ్వడంతో… పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు అసువులు బాశారు.
‘తెలంగాణ బంద్’ నిర్వహించాలని తెలంగాణ ప్రజా సమితి, విద్యార్థి కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చాయి. జూన్ 3న జంట నగరాల్లో వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. అడుగడుగునా ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రజలు రాళ్లురువ్వుతూ ప్రతిదాడికి దిగారు. బస్తీల్లోని పిల్లలు పోలీసులతో బాహాబాహీ తలపడ్డారు. ఉద్యమకారుల్ని వెనుకడుగు వేయించేందుకు పోలీసులు 12 సార్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పులో ఆరుగురు చనిపోయారని పోలీసులు ప్రకటించారు. మరుసటి రోజూ కాల్పులు జరిగాయి. తలుపులు, కిటికీల గుండా దూసుకుపోయిన తూటాలకు ఇంట్లో టీ తాగుతున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు.