దేవరకొండ రూరల్, జూన్ 05 : గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్యం శిబిరం అభినందనీయం అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామంలో మునుకుంట్ల వెంకట్ రెడ్డి సౌజన్యంతో నిర్వహిస్తున్న ఉచిత మెగా కంటి వైద్య శిబిరంను ఆయన సందర్శించి పలువురికి కళ్లజోళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమాజ సేవా దృక్పథంతో ఈ క్యాంప్ ఏర్పాటు చేసిన మునుకుంట్ల వెంకట్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.
ప్రజల ఆరోగ్యం కోసం నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలు సమాజ అభివృద్ధికి ఎంతో దోహద పడతాయన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కంటి వ్యాధుల నివారణకు, ముందస్తు గుర్తింపునకు ఇటువంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అనంతరం క్యాంప్ నిర్వాహకులు ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునికుంట్ల వెంకట్ రెడ్డి, స్థానిక ఉప సర్పంచ్ కడారి సైదులు, బొడ్డుపల్లి కృష్ణ, వత్త్య బాలు, అప్పనాల తిరుమల, గుండాల వెంకట్, మల్లేష్ పాల్గొన్నారు.