హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): తవుడుకు తావే ఉండదు. నూక గింజ కనిపించదు. గంటకు 4 టన్నుల నుంచి 40 టన్నుల ధాన్యం మిల్లింగే లక్ష్యంగా రాష్ట్రం లో అత్యాధునిక రైస్ మిల్లుల ఏర్పాటుకు సర్కారు సన్నాహాలు చేస్తున్నది. రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా ఆవిర్భవిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ రైస్ మార్కెట్కు తగ్గట్టు రైస్ మిల్లింగ్ చేయాలని నిర్ణయించింది. ఈ ఏడా ది భారీఎత్తున రైస్మిల్లుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్న సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్ నేతృత్వంలో వ్యవసాయ, పరిశ్రమల, రెవెన్యూ, మార్కెటింగ్ శాఖల అధికారులు పెద్దఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు నెలకొల్పేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ పార్కుల్లోనే అత్యాధునిక రైస్ మిల్లుల ఏర్పాటుపై శ్రద్ధ పెడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో రైస్మిల్లుల ఏర్పాటుకు 1500 మంది దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. వీటిని ఏడాదిలోగా అందుబాటులోకి తీసుకురావాలని సర్కారు భావిస్తున్నది. ఇందుకోసం రైస్ మిల్లింగ్లో దేశీయంగా, అంతర్జాతీయంగా పేరున్న సంస్థలను సంప్రదిస్తున్నట్టు తెలిసింది. జపాన్కు చెందిన పటాకి సంస్థతో చర్చలు జరుపగా.. రైస్ మిల్లింగ్పై ఆ సంస్థ.. సీఎస్కు పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్టు సమాచారం. ఈ సంస్థకు చెందిన మెషినరీ 64 దేశాల్లో ఉన్నట్టు తెలిసింది. నిజామాబాద్, మిర్యాలగూడతోపాటు పంజాబ్, హర్యానాలో కూడా పటాకి సంస్థ అత్యాధునిక మిల్లులు ఉన్నా యి. రుచికరంగా ఉండే తెలంగాణ బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డి మాండ్ ఉన్నది. ఈ మేరకు ఎగుమతే లక్ష్యంగా ధాన్యంలో నూకలు, తవుడు లేకుం డా మంచి బియ్యం వచ్చేలా అత్యాధునిక మిల్లులను ఏర్పాటుచేయాలని సర్కారు భావిస్తున్నది.
రెడీ టు కుక్
రోజురోజుకు జీవన శైలి మారుతున్నది. ఉద్యోగులు, వ్యాపారాలతో బిజీగా ఉంటున్న చాలామంది మెస్లు, హోటళ్లలో భోజనాలు చేస్తున్నారు. పార్సిళ్లు తెప్పించుకొంటున్నారు. ఇది అనారోగ్యానికి దారితీస్తున్నది. దీన్ని గుర్తించిన అధికారులు రెడీ టు కుక్ విధానంలో ఆఫ్ బాయిల్డ్ రైస్ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. అమెరికా వంటి దేశాల్లో రెడీ టు కుక్ రైస్ అమలులో ఉన్నది. 15 నిమిషాల్లో అన్నం సిద్ధమవుతుంది. కిలో, రెండు కిలోలు, మూడు కిలోల ప్యాకెట్లతో ఆఫ్ బాయిల్డ్ రైస్ను మార్కెట్లోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు రైస్ మిల్లులను సిద్ధం చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు.