హైదరాబాద్: కరోనా విళయతాండవం అనంతంరం రాష్ట్రంలో నేడు ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 శాతం విద్యార్థులు స్కూళ్లకు హాజరయ్యారని తెలిపారు. బుధవారం హైదరాబాద్ విజయనగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. స్కూళ్లల్లో పారిశుధ్యం పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పారు. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలని అధికారులను ఆదేశించామని, ప్రార్థన సమయంలోనే జాగ్రత్తలు గుర్తు చేయాలని వెల్లడించారు. రాష్ట్రంలోని 60 లక్షల మంది విద్యార్థుల్లో సుమారు 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఒకటో తరగతిలో అదనంగా లక్ష మంది విద్యార్థులు చేరారని వెల్లడించారు. మొత్తంగా ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 2.5 లక్షల కొత్త అడ్మిషన్లు వచ్చాయన్నారు.