Summer | హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. మార్చిలో మధ్యనే మాడ పగిలేలా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రెండు మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు మరింత అధికమయ్యాయి. ప్రస్తుతం మధ్యాహ్నం నుంచి తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండ దంచి కొడుతున్నది. మధ్యాహ్నం వేళ ఉక్కపోత తీవ్ర ఇబ్బంది పెడుతున్నది. ఉదయం 9 దాటితే భానుడు భగభగ మండుతుండటంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు.
ఎల్నినో ప్రభావంతో మార్చిలోనే రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే మొదటిసారి అని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వచ్చే వారం ఎండలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని, ప్రజ లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. హైదరాబాద్లో బుధవారం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఈ నెల ముగిసేసరికే 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రహదారులపై సిగ్నళ్ల వద్ద ద్విచక్ర వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు.
11-3.30 మధ్యన బయటకు వెళ్లొద్దు
ఎండల్లో తిరిగేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని డాక్టర్లు సూచించారు. ఎండతీవ్రతతో శరీరం పొడిబారడం, ఎర్రగా మారడం, తలవొప్పి, దురదలు, వాంతులు, సృ్పహ కోల్పోవడం వంటివి సంభవిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని తెలిపారు. బీపీ, షుగర్, గుండె జబ్బులు, చర్మవ్యాధులతో బాధపడేవారు వేసవిలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ లేదా ఉప్పు కలిపిన మజ్జిగ, ఉప్పు, చకెర కలిపిన నిమ్మరసం తీసుకుంటే.. లవణాలు అందుతాయని చెప్పారు. సూర్యోదయానికి ముందే వ్యాయామం చేయాలని, అతిగా మాంసాహా రం తీసుకోవద్దని హెచ్చరించారు. అత్యవసరం అయితేతప్ప ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్య బయటకు వెళ్లకపోవటమే ఉత్తమమని వాతావరణశాఖ నిపుణులు సూచించారు.