ఖమ్మం, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో ఆర్టీసీ ఆస్తులను సృష్టించి, ఉన్న ఆస్తులను కాపాడింది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టంచేశారు. ఇవరం తెలవనోడు, కత్తి, నెత్తి తెలవనోడు చెప్పే మాటల్లో వాస్తవాలు లేదని అన్నారు. ఖమ్మంలోని నూతన బస్టాండ్ పక్కనే రూ.40 కోట్లతో నిర్మించే ఆర్టీసీ ఏసీ కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి ఆదివారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్నేశారని మాట్లాడటంలో అర్థం లేదని అన్నారు. ఈ నాలుగేండ్లలో వాటిపై ఎవరి కన్ను పడనీయకుండా, గజం స్థలం కూడా అన్యాక్రాంతం కాకుండా చేశామని స్పష్టంచేశారు.
గజం రూ.లక్ష ఉన్న ఈ స్థలంలో రూ.40 కోట్లతో కన్వెన్షన్ హాల్ను నిర్మిస్తున్నామని, ఇక్కడ స్థలం రూ.60 కోట్లుంటే, కన్వెన్షన్ హాల్కు అయ్యే రూ.40 కోట్లు మొత్తం రూ.100 కోట్ల ఆస్తిని సృష్టించామని పేర్కొన్నారు. పక్కనే 5 ఎకరాల్లో కట్టిన బస్టాండ్ రూ.200 కోట్లు విలువ ఉంటుందని, ఒక్క ఖమ్మంలోనే దాదాపు రూ.300 కోట్ల ఆస్తిని సృష్టించిన మహా నాయకుడు కేసీఆర్ అని స్పష్టంచేశారు. కరోనా సమయంలో 180 రోజులు బస్సులు తిరగక ఆర్టీసీకి తీరని నష్టం వాటిల్లిందని గుర్తుచేశారు. అయినా సీఎం కేసీఆర్ ఆర్టీసీని, కార్మికులను గుండెల్లో పెట్టకొని కాపాడారని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఏటా రూ.150 కోట్లు ఇచ్చి ఆదుకున్నారని తెలిపారు. పెరిగిన డీజిల్ ధరలతో రోజుకు రూ.2.5 కోట్లు సంస్థపై అదనపు భారం పడుతున్నదని, వీటిన్నింటి దృష్ట్యా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్టు వెల్లడించారు.
ఖమ్మం భూమి పుత్రుడిని నేను
ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ అందరికీ అవకాశాలు ఇచ్చారని, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో కొందరు విఫలమయ్యారని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. ఓడిపోయిన వ్యక్తికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని స్పష్టంచేశారు. స్థానిక నెహ్రూనగర్లో జరిగిన ఆత్మీయ సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి సీఎం కేసీఆర్ చాలా అవకాశాలిచ్చారని, మంత్రిగా తనకు, ఎంపీగా నామాకు, ఎమ్మెల్సీగా తాతా మధుకు, ఖమ్మం మేయర్, డీసీఎంఎస్ చైర్మన్, ఖమ్మం ఏఎంసీ వైస్ చైర్మన్, అనేక జడ్పీటీసీ, ఎంపీపీలు, ఇతర ప్రజాప్రతినిధులుగా అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు.
ఖమ్మంలో ఓడిపోగానే, పాలేరుకు వెళ్లి ఇప్పుడు ఏవో మాటలు చెప్పేవారిని నమ్మి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. తాము ఇక్కడే పుట్టి ఇక్కడే భూమిపుత్రులుగా ఉన్నామని చెప్పారు. కేసీఆర్ ద్వారానే ఖమ్మానికి సీతారామ ద్వారా గోదావరి నీళ్లు వస్తాయని స్పష్టంచేశారు. అభివృద్ధిలో ముందున్న ఖమ్మంను వెనుకకు నెట్టాలని కొందరు కలలు కంటున్నారని, అవి నెరవేరవని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.