హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో భూ సేకరణ చేయటానికి మరో నాలుగు క్యాపిటల్ ‘ఏ’ గెజిట్లను కేంద్ర రోడ్డు రవాణా శాఖ విడుదల చేసింది. సంగారెడ్డి ఆర్డీవో పరిధిలో 195 హెక్టార్లు, భువనగిరి ఆర్డీవో పరిధిలో 199 హెక్టార్లు, గజ్వేల్ ఆర్డీవో పరిధిలో 389 హెక్టార్లు, నర్సాపూర్ ఆర్డీవో పరిధిలో 303 హెక్టార్ల భూ సేకరణకు కేంద్రం ఎట్టకేలకు క్యాపిటల్ ‘ఏ’ గెజిట్లు విడుదల చేసింది. ఇంకా తూప్రాన్ ఆర్డీవో పరిధిలో క్యాపిటల్ ‘ఏ’ గెజిట్ విడుదల చేయాల్సి ఉన్నది.
ఈ ఏడాది ఏప్రిల్ 3వ వారంలో చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి అడిషనల్ కలెక్టర్, జోగిపేట-అందోల్ ఆర్డీవోల పరిధిలో భూ సేకరణకు గెజిట్ విడుదల చేసిన కేంద్రం.. మిగతా వాటికి గెజిట్లు విడుదల చేయటంలో 4 నెలలు ఆలస్యం చేసింది. అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్రం తాజాగా గెజిట్లు విడుదల చేసింది. వాస్తవానికి ఉత్తర భాగంలో భూ సేకరణ కోసం 8 యూనిట్లను ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా రెండు విడతలుగా 7 యూనిట్లకు గెజిట్లు విడుదల అయ్యాయి. గెజిట్లు విడుదలైన నాటి నుంచి 21 రోజుల వరకు అభ్యంతరాలు సేకరిస్తారు.