Weather Report | హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): విదర్భ నుంచి మరాఠ్వాడ, కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. మంగళవారం నుంచి శుక్రవారం వరకు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకా శం ఉన్నదని హెచ్చరించింది. దక్షిణ, ఆగ్నేయ దిశ నుంచి గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. సోమవారం యాదాద్రి భువనగరి, జనగామ, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసినట్టు పేర్కొన్నది.
ఈసారి ఉత్తర ఈశాన్య, మధ్య భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉత్తర, పశ్చి మ, దక్షిణ తెలంగాణలోని చాలా జిల్లాలలో సాధారణ ఉష్ణోగ్రతలు, తూర్పులోని చాలా జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నట్టు వెల్లడించింది. ఈ నెలలో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మధ్య, తూర్పు భారతదేశంలో చాలా ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొన్నది. తెలంగాణపైనా వడగాలుల ప్రభావం ఉంటుందని హెచ్చరించింది.
చండూరు/కనగల్, ఏప్రిల్ 3: నల్లగొండ జిల్లాలోని చండూరు, మునుగోడు, కనగల్ మండలాల్లో సోమవారం సాయంత్రం భారీ ఈదురుగాలులుతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల వడగండ్లు పడ్డాయి. గాలిదుమారానికి కొన్ని చోట్ల రేకులు ఎగిరిపోయాయి. వడగండ్లకు వరి పంట దెబ్బతిన్నది. అంగడిపేటలో విద్యుత్తు స్తంభాలు కూలాయి.