హైదరాబాద్ : తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ రేంజ్ ఐజీ అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నట్లు తెలిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఒక జవాను కూడా తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు.
సీనియర్ మావోయిస్టు సుధాకర్తో పాటు 40 నుంచి 50 మంది మావోయిస్టులు పేరూరు, ఇల్మిడి, ఊసూరు పోలీసు స్టేషన్ల పరిధిలోని ఓ కొండ ప్రాంతంలో ఉన్నట్లు పోలీసు బలగాలకు సమాచారం అందింది. దీంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లా నుంచి డీఆర్జీ, సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు గ్రేహౌండ్స్ బలగాలు.. మావోయిస్టులను పట్టుకునేందుకు నిన్న సాయంత్రం బయల్దేరారు.
కూంబింగ్లో భాగంగా మంగళవారం ఉదయం 7 గంటలకు బీజాపూర్లోని సీమల్దొడ్డి గ్రామం, తెలంగాణలోని పెనుగోలు గ్రామ సరిహద్దుల వద్ద బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నారు.
ఈ కాల్పుల్లో గ్రేహౌండ్స్కు చెందిన ఒక జవాను గాయపడటంతో, చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో వరంగల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ జవానుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. జవాను ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.
సౌత్ బస్తర్ దంతేవాడ పోలీసు స్టేషన్ పరిధిలోని కొండ ప్రాంతాల్లో 20 నుంచి 25 మంది మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో అక్కడ కూంబింగ్ నిర్వహిస్తుండగా, పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఆమెను మున్నిగా పోలీసులు గుర్తించారు. ఆ ఏరియాలో కూంబింగ్ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.