బంజారాహిల్స్, అక్టోబర్ 10: బంజారాహిల్స్లో పోలీసులు మంగళవారం చేపట్టిన తనిఖీల్లో రూ.3.35 కోట్ల హవాలా సొమ్మును పట్టుబడింది. వెస్ట్జోన్ డీసీపీ జోయల్ డేవిస్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. బంజారాహిల్స్, నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా బంజారాహిల్స్లోని టీవీ9 జంక్షన్ సమీపంలో వాహన తనిఖీ చేపట్టారు. టీఎస్ 09448 నంబర్ గల కియా కారును తనిఖీ చేయగా భారీగా నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. వాటిని లెక్కించగా, రూ.3.35 కోట్ల నగదుగా తేలింది.
కారులో ఉన్న నలుగురిని పోలీసులు ప్రశ్నించగా.. తాము గోషామహల్, బేగంపేట ప్రాంతాల నుంచి హవాలా సొమ్మును సేకరించి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో డెలివరీ చేస్తామని తెలిపారు. పట్టుబడినవారిలో చందరానగర్లోని వైఎన్ఆర్ గ్రీన్హిల్స్లో నివసించే చింపిరెడ్డి హనుమంతరెడ్డి (48), ముషీరాబాద్ నివాసి బచ్చల ప్రభాకర్(52), మదీనగూడ సాయినగర్ కాలనీకి చెందిన మందల శ్రీరాములురెడ్డి (41), మందల ఉదయ్కుమార్రెడ్డి (23) ఉన్నారు.
బంజారాహిల్స్ రోడ్డు నంబర్-3లోని అరోరాకాలనీలో ఆఫీసు నిర్వహిస్తున్నామని నిందితులు అంగీకరించారు. రూ.1 కోటి హవాలా సొమ్ము డెలివరీకి కమీషన్గా రూ.25 వేలు తీసుకుంటామని తెలిపారు. నగదుతోపాటు క్యాష్ కౌంటింగ్ మిషిన్, కారును పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడిన నగదును ఆదాయపు పన్నుశాఖకు అప్పగిస్తామని డీసీపీ వెల్లడించారు.