నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. ఎగువ నుంచి 4.17 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 22 గేట్లను ఎత్తి 3.69 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ప్రాజెక్టు నుంచి మొత్తంగా 4.17 లక్షల క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 589.60 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టులో మొత్తం 312.04 టీఎంసీల నీటిని నిల్వ ఉంచవచ్చు. అయితే ఇప్పుడు 310.44 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ విద్యుత్ ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది.
ఇక ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగతున్నది. ప్రాజెక్టుకు 3,85,530 క్యూసెక్కుల వరద వస్తుండగా, 4,40,702 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో అధికారులు 10 గేట్లు ఎత్తివేశారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుకాగా, ప్రస్తుతం 884.60 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది.