హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడు లక్షల ఎకరాల పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఒక సర్వే నంబర్లోని ఏదైనా బై నంబర్ భూమిపై వివాదం ఉంటే, ఆ సర్వే నంబర్ మొత్తాన్ని నిషేధిత జాబితాలో చేర్చడంతో పలువురు రైతులు ఇబ్బందిపడాల్సి వచ్చింది. ధరణి సమస్యలపై ఏర్పాటైన సబ్ కమిటీ కూడా ఈ సమస్యను గుర్తించింది. జిల్లా కలెక్టర్లు ఇలాంటి భూములను గుర్తించి, నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు. ఉన్నతాధికారులకు అందిన నివేదికల అధారంగా ఆయా భూములను నిషేధిత జాబితా నుంచి విడుదల చేసినట్టు తెలిసింది. పలు ప్రాంతాల్లో కాలువలు, రోడ్లు తదితర అవసరాలకు ప్రభుత్వం కొంత భూమిని సేకరించిన సందర్భాల్లో ఆ సర్వే నంబర్ మొత్తం నిషేధిత జాబితాలో చేరింది. వీటితోపాటు ఇతర కారణాల వల్ల పొరపాటున నిషేధిత జాబితాలో చేరిన భూములను విడుదల చేసే అంశంపై కూడా అధికారులు దృష్టి సారించారు. వీటిపై త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నది.