హైదరాబాద్, మార్చి 8 : కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా నూతన ఆవిష్కరణలను చేపట్టేందుకు దేశంలోని 10 రాష్ర్టాలకు చెందిన 38 స్టార్టప్లను తెలంగాణ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ (టీ-ఏఐఎం) ఎంపిక చేసింది. ‘రెవ్ అప్’ యాక్సిలరేటర్ రెండవ కోహర్ట్ కోసం ఎంపిక చేసిన ఈ స్టార్టప్లలో ఎంటర్ప్రైస్ సాస్, ఆరోగ్య సంరక్షణ, ఈ-కామర్స్, హెచ్ఆర్టెక్ తదితర 12 రంగాల స్టార్టప్లు ఉన్నాయి. వీటిలో మహిళలు స్థాపించిన స్టార్టప్లు 40% వరకు ఉన్నట్టు టీ-ఏఐఎం నిర్వాహకులు వెల్లడించారు. తెలంగాణ ఏఐ మిషన్ ఆధ్వర్యంలో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) సహకారంతో ఈ స్టార్టప్లను బలోపేతం చేస్తారు. ఇవి ఆరోగ్య సంరక్షణ, కాలుష్య నివారణ, వ్యర్థ జలాల నిర్వహణకు తగిన పరిష్కారాలను సూచిస్తాయని, సమీప భవిష్యత్తును ఎంతో ప్రభావితం చేస్తాయని రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించే తదుపరి రెవ్ అప్ యాక్సిలరేషన్ కార్యక్రమానికి జూలైలో దరఖాస్తుల ప్రక్రియ చేపడతామని టీ-ఏఐఎం నిర్వాహకులు తెలిపారు.