KGBV | హైదరాబాద్ : రాష్ట్రంలోని 38 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ఇంటర్మీడియట్ వరకు అప్ గ్రేడ్ చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వీటిలో 2023-24 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం, 2024-25 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.7.60 కోట్ల భారం పడుతుందని తెలిపారు.
రాష్ట్రంలో 475 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఉండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 245 విద్యాలయాలను ఇంటర్మీడియట్ వరకు అప్ గ్రేడ్ చేసిందని పేర్కొన్నారు. వీటిలో ప్రస్తుతం 26,027 మంది బాలికలు ఇంటర్మీడియట్ చదువుతున్నారని తెలిపారు. ప్రస్తుతం 38 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను అప్ గ్రేడ్ చేయడం వల్ల ఈ సంవత్సరం 3040 మంది బాలికలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న 475 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో మొత్తం 1,33,879 మంది విద్యార్థులు చదువుతున్నారని మంత్రి తెలిపారు. నూతనంగా అప్ గ్రేడ్ చేసిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో రెండేసి గ్రూపులను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.