హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): పట్టణ ప్రగతి కింద రాష్ట్ర ప్రభుత్వం గత రెండేండ్లలో మున్సిపాలిటీలకు రూ.3,786 కోట్లు అందజేసింది. ఇందులో జీహెచ్ఎంసీకి రూ.1,919 కోట్లు, మిగిలిన 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రూ.1,866 కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల్లో ఇప్పటివరకు రూ.3,066 కోట్లు ఖర్చు చేశారు. తెలంగాణలోని అన్ని పట్టణాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న విషయం విదితమే. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా సహకరించకున్నా, కరోనా లాంటి సంక్షోభాలు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఠంచన్గా పట్టణ ప్రగతి నిధులను విడుదల చేస్తున్నది. దీంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మౌలిక వసతులు, శానిటేషన్ గణనీయంగా మెరుగుపడ్డాయి.
139 ఎఫ్ఎస్టీపీలు
భూగర్భ జలాలు కలుషితం కాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 71 నగర, పురపాలికల్లో రూ.250 కోట్లతో మానవ మల వ్యర్థాల శుద్ధి ప్లాంట్ (ఎఫ్ఎస్టీపీ)లను నిర్మించాలని నిర్ణయించింది. వీటికి అదనంగా మరో రూ.177 కోట్లతో కొత్తగా 68 పురపాలికల్లో ఎఫ్ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. దీంతో మొత్తం ఎఫ్ఎస్టీపీల సంఖ్య 139కి పెరగనున్నది. రోజూ 2,060 కిలోలీటర్ల మానవ మల వ్యర్ధాలను శుద్ధి చేయగలిగే ఈ ఎఫ్ఎస్టీపీల్లో ఇప్పటికే 20 పూర్తయ్యాయి. 60 ఎఫ్ఎస్టీపీల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మిగిలిన చోట్ల ఎఫ్ఎస్టీపీల ఏర్పాటుకు స్థలాలను సేకరించాల్సి ఉన్నది.
9,088 ప్రజా మరుగుదొడ్లు
గతంలో జీహెచ్ఎంసీ మినహా 141 పుర, నగరపాలికల్లో 4,970 పబ్లిక్ టాయిలెట్లు మాత్రమే ఉండేవి. దీంతో ప్రజల ఇబ్బందులపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్.. ప్రతి వెయ్యి మందికి ఒకటి చొప్పున పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తదనుగుణంగా మరో 4,118 (పురుషులకు 2,060, మహిళలకు 2,058) పబ్లిక్ టాయిలెట్లను నిర్మించడంతో వాటి మొత్తం సంఖ్య 9,088కి పెరిగింది. వీటి నిర్వహణ కోసం ప్రత్యేక యాప్ను రూపొందించారు.
అదనంగా 2,165 శానిటేషన్ వాహనాలు
పట్టణ ప్రగతి ప్రారంభానికి ముందు జీహెచ్ఎంసీ మినహా 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2,548 శానిటేషన్ వెహికల్స్ ద్వారా రోజుకు 2,675 టన్నుల చెత్తను తరలించేవారు. పట్టణ ప్రగతి ప్రారంభం అనంతరం అదనంగా 2,165 శానిటేషన్ వాహనాలను కొనుగోలు చేశారు. తద్వారా ఇప్పుడు రోజూ 4,356 టన్నుల చెత్తను తరలించగలుగుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నది. దీనిలో భాగంగా 141 పురపాలికలు మొత్తం 965 ఎకరాల్లో డంపింగ్ యార్డులను నిర్వహిస్తున్నాయి. 205 చోట్ల తడి, పొడి చెత్త సేకరణ కేంద్రాలతోపాటు 224 కంపోస్ట్ షెడ్స్, బెడ్స్ను ఏర్పాటు చేశాయి.